22ఏ భూముల పేరుతో ఎవరికీ అన్యాయం చేయం | No injustice shall be done to anyone in name of lands 22A | Sakshi
Sakshi News home page

22ఏ భూముల పేరుతో ఎవరికీ అన్యాయం చేయం

Aug 6 2026 2:41 AM | Updated on Aug 6 2026 2:41 AM

No injustice shall be done to anyone in name of lands 22A

కొత్తగా ఒక్క సెంటు భూమినీ నిషేధిత జాబితాలో చేర్చలేదు 

ఫిర్యాదులొస్తే నిర్ణీత గడువులో పరిష్కరించాలి.. అర్హులైన వారి హక్కులు కాపాడుతూనే ప్రభుత్వ భూములు పరిరక్షించాలి 

జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో పేదలు, నిజమైన హక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత 22ఏ జాబితాలో చేర్చలేదని చెప్పారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ లేదని, వివాదాల్లేని ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో చేర్చామన్నది అవాస్తవమని స్పష్టంచేశారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలోని 22ఏ భూముల జాబితాపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ వైఖరిపై బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. 22ఏ భూముల విషయంలో ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి ఆలోచనను అర్థం చేసుకుని అధికారులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. 

ప్రజల హక్కులు, ప్రభుత్వ ప్రయోజనాలు రెండింటినీ సమతుల్యం చేస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని, అర్హులైన వ్యక్తులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వ భూములను కాపాడటం కూడా బాధ్యత అనే విషయాన్ని అధికారులు మర్చిపోవద్దన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి చట్టబద్ధంగా నిబంధనల మేరకు అన్ని అంశాలను గుర్తించి ప్రజల ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు నిర్ణీత కాలంలో పరిష్కరించాలని సూచించారు. హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

22ఏ జాబితాలోని భూములను సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉందని, అన్ని జిల్లాల కలెకర్లు తమ సూచనలను పాటించాలని చెప్పారు. ప్రభుత్వ భూములపై అక్రమ లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంతు, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మేడ్చల్‌ జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ హాజరయ్యారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement