కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, కడియం కావ్య, రఘురాంరెడ్డి, గడ్డం వంశీకృష్ణ, అనిల్కుమార్యాదవ్, మల్లు రవి
తుమ్మిడిహెట్టిపై కేంద్రమంత్రి పాటిల్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య భేటీ ఏర్పాటు చేయండి
సానుకూలంగా స్పందించిన పాటిల్
కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్తోనూ సీఎం భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణం ఎత్తు పెంచడానికి అనుమతించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బరాజ్ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొన్నారు. కాబట్టి కనీసం 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం.. బుధవారం ఉదయం కేంద్రమంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యత, ఈ ప్రాజెక్టుకు అనుమతుల మంజూరు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను రాసిన లేఖ, దానికి పీఎంఓ స్పందించి జలవనరుల శాఖకు లేఖ పంపడం తదితర విషయాల గురించి పాటిల్కు ముఖ్యమంత్రి వివరించారు.
తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి గతంలోనే ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే 152 మీటర్ల వరకు ఎత్తుతో బరాజ్ నిర్మించే అంశంపై పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం చేసిందని, ఆ అధ్యయనం ప్రకారం152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించినా ముంపులో పెద్దగా తేడా లేదని స్పష్టమైందని చెప్పారు. ఆ ముంపులోనూ 50 శాతం నదీ గర్భంలోనే ఉంటుందని వివరించారు. ఒకవేళ 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే గ్రావిటీ ద్వారా కావల్సినంత నీరు సరఫరా చేయలేమని అన్నారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పీఎంఓ నుంచి లేఖ వచ్చింది: పాటిల్
పీఎంఓ నుంచి లేఖ అందిందని ముఖ్యమంత్రికి పాటిల్ చెప్పారు. దీనిపై తొలుత కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్రస్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్కుమార్ యాదవ్, కడియం కావ్య, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, ముఖ్య కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు.
ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వండి
పాలమూరు–రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను ముఖ్యమంత్రి కోరారు. బుధవారం పార్లమెంట్ భవన్లో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో పాటు కేంద్రమంత్రిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.3,187 కోట్లు, సీతమ్మ సాగర్పై రూ.1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధులను వ్యయం చేసిందని చెప్పారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయి, ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని వివరించారు.
ప్రధానిని దూషిస్తే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసైనా పెట్టారా?
ప్రదానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన దివంగత మాతృమూర్తి హీరాబెన్ మోదీలను సోషల్ మీడియా వేదికగా దూషించిన ఘటనలపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం ఒక్క కేసైనా నమోదు చేశారా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం పూర్తిగా చట్ట ప్రకారమే ముందుకు వెళ్తోందన్నారు. సోషల్ మీడియాలో ప్రధానిని, ఆయన తల్లిని దూషిస్తున్నారంటూ హైదరాబాద్కు చెందిన బీజేపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసు అధికారిని బదిలీ చేశారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్తో భేటీ తర్వాత సీఎం మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు.
పనీపాటా లేనోళ్లు విమర్శలు చేస్తున్నారు..
వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారని రేవంత్ చెప్పారు. ‘ప్రధానిపై, ఆయన తల్లిపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి డీఎస్పీ బదిలీ వ్యవహారంపై ఢిల్లీలో పనీపాటా లేని కొందరు విమర్శలు చేస్తున్నారు..’అని పరోక్షంగా కిషన్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారుల బదిలీ అనేది ముఖ్యమంత్రికి రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారమని, తన బాధ్యతల్లో అది కూడా ఒకటని పేర్కొన్నారు. బీజేపీ నేతలే వేరేవాళ్లను దారుణంగా తిడుతున్నారని, కాంగ్రెస్ నేతలను, ప్రతిపక్ష పారీ్టల నాయకులను, విద్యార్థులను అభ్యంతరకరమైన పదాలతో దూషిస్తున్నారని మండిపడ్డారు.


