హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీని తప్పనిసరి చేశామని, తమకు వచ్చిన ఎన్వోసీలను హైడ్రాతో కమ్యూనికేట్ చేయడం వల్ల బోగస్ అని తేలినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు. హైడ్రాకు వచ్చిన అప్లికేషన్లు తమకు ఇవ్వడం వల్ల ఫేక్ ఎన్వోసీల గుట్టు రట్టయ్యిందన్నారు.
ఫేక్ ఎన్వోసీలపై విచారణ జరుగుతుంది. ఎన్ని ఫేక్ ఎన్వోసీలు ఇచ్చారనేది విచారణ తర్వాతే తేలుతుంది. ఫేక్ ఎన్వోసీలపై హైడ్రా, ఇంటర్మీడియట్ బోర్డు సీరియస్గా ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్నల్ ఎంక్వరీ కూడా చేస్తున్నాం.
విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. విద్యార్థులు నష్టపోకుండా అన్ని చర్యలు చేపడతాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో అన్ని వివరాలు ఉన్నాయి. డౌట్ ఉంటే తల్లిదండ్రులు చెక్ చేసుకోవచ్చ. ఈసారి 3 ఏల పైచిలుకు కాలేజీలు పర్మిషన్ తీసుకున్నాయి’ అని తెలిపారు.
కాగా, ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీల భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలు (NOCలు) సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది ప్రైవేట్ కాలేజీలపై కేసు నమోదైంది. దీంతో, ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఈ నకిలీ ఎన్వోసీలను ఇంటర్ బోర్డుకు సమర్పించి గుర్తింపు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. హైడ్రా పేరుతో తయారు చేసిన నకిలీ పత్రాల వ్యవహారం వెలుగులోకి రావడంతో, సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు


