కొత్తగా రెండున్నర లక్షల పింఛన్ల మంజూరుకు పంచాయతీరాజ్శాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగా చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియను సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్టు అధికారవర్గాల సమాచారం. జిల్లాల్లో ఇన్చార్జీ మంత్రులు లబ్దిదారులకు పింఛన్ ప్రొసీడింగ్స్ అందజేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రంలోని తలసేమియా, సికిల్సెల్ అనీమియా బాధితులందరికీ నూతన సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వీటి మంజూరు ప్రక్రియ ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని సూచించారు. గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) రికార్డుల ప్రకారం ఇప్పటికే ప్రాథమికంగా 1,599 మంది బాధితులను గుర్తించి సర్టిఫికెట్లు ఇచ్చారు.
మిగిలిన అర్హులైన బాధితులు కూడా వైద్య ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 6 వేల తలసేమియా, 1,700 సికిల్సెల్ అనీమియా బాధితులున్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీరిలో ఆగస్టు 15 నుంచి ఎంత మందికి నెలకు రూ.2,016 చొప్పున చేయూత పింఛన్లు మంజూరు చేస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు.


