
ఒక్కో నేత ఒక్కో పార్టీని లక్ష్యంగా చేసుకుని హాట్ కామెంట్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్
ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళిక
కీలక నేతల మధ్య సమన్వయ లోపం.. శ్రేణుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. సమీప భవిష్యత్తులో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉండగా, ఆ వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. ఈ రెండింటిలో వచ్చే ఫలితాలు వచ్చే శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే అంచనాతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలో గెలవడంతోపాటు జీహెచ్ఎంసీ (GHMC) పీఠం దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించడానికి మార్గం సుగుమం అవుతుందని గుర్తించిన పార్టీ పెద్దలు స్థానిక నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు ద్విముఖ వ్యూహం పాటిస్తోందని నేతలు పేర్కొంటున్నారు.
పార్టీలో కొంతమంది నాయకులు అధికార కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకోగా, మరికొంత మంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిగో ఆధారాలంటూ సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గత 11 ఏళ్లలో సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు గల్లీగల్లీలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్, జాతీయ రహదారులు, డిజిటల్ చెల్లింపులు తదితర అంశాలను వివరిస్తున్నారు. సమీప భవిష్యత్తులో గ్రేటర్లో వార్డులవారీగా ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు.
దూకుడు పెంచిన నేతలు..
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నగరంలో కలియదిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు తీరు నుంచి హైడ్రా (HYDRAA) కూల్చివేతల వరకు సమయం చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మురికివాడల్లో తన బలగాన్ని వేసుకుని పర్యటిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలపై పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను లక్ష్యంగా చేసుకున్నారు.
ఇన్నాళ్లు పార్టీకి కంటిలో నలుసుగా కనిపించిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సైతం పార్టీ లైన్లోకి వచ్చినట్లేనని కార్యకర్తలు, నేతలు భావిస్తున్నారు. గతంలో రాజాసింగ్ను బండి సంజయ్ కలిసి సర్దిచెప్పారు. ఇటీవల సంజయ్ వ్యాఖ్యలను రాజాసింగ్ బలపరుస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సందర్భానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా పార్టీలో కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలు ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
జూబ్లీహిల్స్పై గురి..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి చెందడంలో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండేలా ఎన్నికల వ్యూహాన్ని మార్చుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీని అప్రమత్తం చేశారు. దీంతో బీజేపీ సైతం ఎన్నికలకు సమాయత్తమవుతోంది.
చదవండి: జూబ్లీహిల్స్లో గెలిచే నాయకుడి కోసం హస్తం పార్టీ సర్వే