
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై హరిరామజోగయ్య సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా 24 సీట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అలాగే, జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా? అని అన్నారు.
కాగా, హరిరామజోగయ్య ఆదివారం పవన్ కల్యాణ్కు లేఖ రాశారు. ఈ లేఖలో హరిరామజోగయ్య..‘జనసేన సైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకం ఉందా?. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా?.
ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారు. జనసైనికులకు కావల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు. పవన్ పరిపాలన అధికారం చేపట్టడం. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడమేంటి. జనసేనకు 24 స్థానాలకు మించి గెలిచే సత్తా లేదా?. పొత్తు ధర్మంలో భాగంగా పవన్ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి. చెరిసగం మంత్రి పదవులు దక్కాలి. ఇవ్వన్నీ చంద్రబాబు నాయుడే ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.