ఎన్డీఏ మిత్రపక్షాల డిమాండ్లివే? | The demands of NDA allies | Sakshi
Sakshi News home page

ఎన్డీఏ మిత్రపక్షాల డిమాండ్లివే?

Jun 6 2024 10:12 AM | Updated on Jun 6 2024 10:12 AM

The demands of NDA allies

ప్రధాని మోదీ నాయకత్వంలో కలిసి ఉంటామని మరోమారు ఎన్డీఏ మిత్రపక్షాలు పునరుద్ఘాటించిన దరిమిలా కేంద్ర క్యాబినెట్ బెర్త్‌లపై బీజేపీ  అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆరు కీలక మంత్రిత్వ శాఖల విషయంలో బీజేపీ రాజీపడే అవకాశం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మంత్రిత్వ శాఖల జాబితాలో రైల్వే, హోం, ఫైనాన్స్, డిఫెన్స్, లా,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నాయిని సమాచారం.

అదేవిధంగా మిత్రపక్షాలు 10 నుంచి 12 మంత్రిత్వ శాఖలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా బీజేపీ తన మిత్రపక్షాల మద్దతును మరింతగా పెంచుకుంది. తాజాగా ఏడుగురు స్వతంత్రులు, మరో మూడు చిన్న పార్టీల నుండి బీజేపీకి మద్దతు లభించింది. తాజాగా మద్దతునందించిన 10 మంది ఎంపీలతో ఎన్డీఏకు మొత్తం 303 మంది ఎంపీల మద్దతు  లభించినట్లయ్యింది.

మోదీ ప్రభుత్వం వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో కీలకమైన మంత్రిత్వ శాఖలకు సంబంధించి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోనున్నది. భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే అంశంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. అందుకే దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రక్షణ రంగంలో స్వావలంబనకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ ఇటీవలే పునరుద్ఘాటించారు.

ఆరు కీలక మంత్రిత్వ శాఖలు మినహా మిత్రపక్షాల మంత్రిత్వశాఖల బెర్త్‌ల డిమాండ్లను బీజేపీ అధిష్టానం పరిగణనలోకి తీసుకోనున్నదని సమాచారం. బుధవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, మద్దతు ఒప్పందం తదితర అంశాలపై ఎన్డీఏ నేతలు చర్చించినప్పటికీ, మంత్రిత్వశాఖల కేటాయింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.

16 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న టీడీపీ, 12 స్థానాలు గెలుచుకున్న జేడీ (యూ) మిత్రపక్షాల నుంచి ప్రధాన డిమాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు శివసేన (షిండే) ఏడు, ఎల్‌జేపీ (ఆర్‌వి) ఐదు, హెచ్‌ఏఎం ఒక స్థానంలో విజయం సాధించాయి. జూన్ 7న జరగనున్న  ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంత్రి పదవులకు సంబంధించి మిత్రపక్షాల డిమాండ్లు ప్రస్తావనకు రానున్నాయి.

జనతాదళ్‌(యూ) రెండు మంత్రి పదవులను ఆశిస్తోందని, శివసేన (షిండే) తన కేబినెట్ బెర్త్‌తో పాటు రెండు రాష్ట్ర మంత్రి పదవుల కోసం డిమాండ్ చేసినట్లు ఎన్‌డీఏ వర్గాలు తెలిపాయి. లోక్‌ జనశక్తి పార్టీ (ఆర్‌వీ) ఇంకా తన డిమాండ్లను అధికారికంగా వెల్లడించలేదు. అయితే పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్‌కు ఒక మంత్రివర్గం, ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీ శాంభవి చౌదరితో సహా ఇతర ఎంపీలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. గయ నుంచి ఎన్నికైన బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం ఒక కేబినెట్ ర్యాంక్ పదవిని కోరినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement