అనూహ్యంగా గెలిచిన ఎన్డీఏ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి
న్యూఢిల్లీ/రాంచీ/ఐజ్వాల్: జార్ఖండ్లో గురువారం హోరాహోరీగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా ఎన్డీఏ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నఠ్వాణీ అనూహ్య విజయం సాధించారు. గెలుపు ఖాయమనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా ఓటమిపాలయ్యారు. జార్ఖండ్లో రెండు రాజ్యసభ స్థానాల కోసం మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొన్నారు.
అధికార ‘ఇండియా’కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్లకు 56 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. దీంతో ఒక స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అభ్యర్థి బైద్యనాథ్ రామ్, మరో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ల గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే కనీసం 28 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే అసెంబ్లీలో ఎన్డీఏకు కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. కానీ గురువారం జరిగిన ఓటింగ్లో స్వతంత్ర అభ్యర్థి పరిమళ్కు ఏకంగా 28 ఓట్లు పడ్డాయి.
క్రాస్ ఓటింగ్కు పాల్పడి పరిమళ్ను గెలిపించారని అధికార ‘ఇండియా’కూటమి ఆరోపించింది. పరిమళ్ పోటీచేసిన స్థానానికి జరిగిన ఓటింగ్లో మూడు ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. వీటిలో రెండు బీజేపీ ఎమ్మెల్యేలవికాగా ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యేది. ఇక మిగిలిన మిజోరంలో ఒకటి, జార్ఖండ్లో రెండు స్థానాలకు గురువారం ఎన్నికలు జరిపి వెంటనే ఫలితాలను వెల్లడించారు.


