జీఎస్టీ కోతతో ఎంట్రీ లెవెల్ కార్లకు మళ్లీ డిమాండ్
దీంతో క్రమంగా డిస్కౌంట్లను తగ్గించేస్తున్న వాహన కంపెనీలు
ఎస్యూవీలు, ప్రీమియం వేరియంట్ల మార్కెట్ వాటా పైపైకి...
ఒకప్పుడు భారతీయ రోడ్లపై జూమ్మంటూ దూసుకెళ్లిన చిన్న కార్లు.. ఎస్యూవీల జోరుతో కొన్నేళ్లుగా చిన్నబోతున్నాయి. దీంతో సేల్స్ పెంచుకోవడం కోసం వాహన కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఇచ్చేవి. అయితే, గతేడాది చేపట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల పుణ్యమా అని మళ్లీ చిన్న కార్లకు డిమాండ్ పుంజుకుంటోంది. మరోపక్క, ఈ మాస్ మార్కెట్ విభాగంలో అమ్మకాలు ఫాస్ట్ట్రాక్లోకి రావడంతో హ్యాచ్బ్యాక్లు, ఎంట్రీలెవెల్ కార్లపై కంపెనీలు డిస్కౌంట్లలో కోత పెడుతున్నాయి.
గతేడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో భారీ సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. జీఎస్టీ 2.0లో భాగంగా చిన్న కార్లు, కంపాక్ట్ ఎస్యూవీలను గతంలో ఉన్న 28% శాతం పన్ను శ్లాబ్ నుంచి 18 శాతం పన్ను శ్లాబ్లోకి చేర్చారు. దీంతో కంపెనీలు కూడా ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించడంతో ఆయా సెగ్మెంట్లలోని కార్ల ధరలు (దాదాపు 5–7 శాతం) వెంటనే దిగొచ్చాయి. దీనికి కంపెనీల డిస్కౌంట్లు కూడా తోడవడంతో చిన్న కార్లకు గిరాకీ అమాంతం పెరిగింది.
ఇదే తడవుగా కార్ల కంపెనీలు ఇప్పుడు డిస్కౌంట్ల విషయంలో రివర్స్ గేర్ వేస్తున్నాయి. మారుతీ సుజుకీ పాపులర్ చిన్న కారు వ్యాగన్ఆర్పై మే నెలలో రూ.31,000 వరకు రాయితీ ఇవ్వగా.. దీన్ని జూన్లో రూ.10,000కు తగ్గించింది. బాలెనోపై కూడా డిస్కౌంట్ను రూ.31,000 నుంచి 21,000కు కట్ చేసింది. ఇక టాటా మోటార్స్ అయితే, టియాగో, పంచ్ మోడళ్లపై ప్రోత్సాహకాలను పూర్తిగా ఎత్తేయడం గమనార్హం. అంతక్రితం టియాగోపై రూ.19,000... పంచ్పై రూ.26,000 చొప్పున తగ్గింపు ఉండేదని నువామా రీసెర్చ్ వెల్లడించింది. మరో దిగ్గజం హ్యుందాయ్ సైతం ఎంట్రీ లెవెల్ మోడల్స్ గ్రాండ్ ఐ10 నియోస్, ఎక్స్టర్లపై ప్రయోజనాల్లో కోత విధించింది.
రేట్లు పెరిగినా ఫుల్ డిమాండ్...
జీఎస్టీ కోతకు తోడు తొలిసారి కారు కొనుగోలుదారులు ఎంట్రీ లెవెల్ కార్ల వైపు మళ్లీ మొగ్గుచూపుతుండటం, గ్రామీణ ఆదాయాల దన్నుతో చిన్న కార్ల సెగ్మెంట్కు జోష్ లభిస్తోంది. ఇదిలాఉండగా.. పశ్చిమాసియా యుద్ధం సెగతో ముడిసరుకుల ధరలు ఎగబాకిన నేపథ్యంలో వాహన కంపెనీలు రేట్ల పెంపు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి, ఏప్రిల్లో ధరలు పెంచినప్పటికీ చిన్న, కాంపాక్ట్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉందని మారుతీ డీలర్ ఒకరు వెల్లడించారు. ఇప్పటికీ జీఎస్టీ కోత ప్రయోజనం కంపెనీలకు కలిసొస్తోందన్నారు. కాగా, డిస్కౌంట్ల తగ్గింపు ట్రెండ్ను మారుతీ, టాటా మోటార్స్ డీలర్లు ధృ
వీకరిస్తున్నారు. టాటా మోటార్స్ తాజాగా టియాగో మోడల్లో పెట్రోల్, సీఎన్జీ, ఈవీ ఫేస్లిఫ్ట్ వేరియంట్లను ఎలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు లేకుండానే ప్రవేశపెట్టినప్పటికీ బుకింగ్స్ భారీగానే వచ్చాయని టాటా మోటార్స్ డీలర్ ఒకరు పేర్కొన్నారు.
అమ్మకాలు రయ్..
హ్యాచ్బ్యాక్లు, ఎంట్రీ లెవెల్ కార్ల సేల్స్ టాప్గేర్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి రెండు నెలల్లో మారుతీ ఆల్టో, ఎస్ప్రెసో మోడల్స్ అమ్మకాలు 146 శాతం పుంజుకొని 32,341 కార్ల అమ్మకాలు నమోదు కావడం విశేషం. కాంపాక్ట్, మిడ్సైజ్ మోడళ్లయిన బాలెనో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, సియాజ్ అమ్మకాలు సైతం భారీగా పెరిగాయి. ఏప్రిల్–మే నెలల్లో 31 శాతం ఎగసి 1,62,214 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వాటి అమ్మకాలు 1,23,872 మాత్రమే. అయితే, గత ఐదారేళ్లుగా చిన్న కార్ల మార్కెట్ వాటా తగ్గుతూనే వస్తోంది.
మొత్తం ప్యాసింజర్ కార్లలో ఎంట్రీలెవల్ కార్ల వాటా ప్రస్తుతం 23 శాతానికే పరిమితమైంది. కోవిడ్ ముందు, అంటే 2018–19లో ఇది ఏకంగా 46% కావడం గమనార్హం. ఇప్పటికీ కారు ప్రియులు ఎస్యూవీలు, లగ్జరీ వేరియంట్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే, జీఎస్టీ కోత తర్వాత అఫర్డబుల్ కార్ల విభాగంలో కంపెనీలకు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయని.. దీనికి తాజా విక్రయాల ట్రెండ్ నిదర్శనమనేది పరిశ్రమ వర్గాల టాక్.


