
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రగిరి క్లాక్ టవర్ సర్కిల్ వద్ద నిరసన నిర్వహించారు. నల్ల జెండాలు పట్టుకుని నిరసనకు దిగారు. చెవిరెడ్డి అరెస్ట్ అప్రజాస్వామ్యమంటూ నినాదాలు చేశారు. ‘‘రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు- అంబేద్కర్ రాజ్యాంగమే ముద్దు" అంటూ బ్యానర్ ప్రదర్శించారు. ఈ ర్యాలీలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొన్నారు.
చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి లక్ష్మి మాట్లాడుతూ.. చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏనాడు బయటకు రాని వాళ్లం మేము ఈరోజు మీడియా ముందుకు బాధతో రావాల్సిన పరిస్థితి.
..చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడమే మేము చేసిన తప్పా.. గత పదేళ్లు మేము చంద్రగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఏ ఒక్కరినీ అరెస్ట్ చేసింది లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా కుటుంబంపైనే కక్ష సాధింపు చర్యలకు దిగింది’’ అని చెవిరెడ్డి సతీమణి లక్ష్మి పేర్కొన్నారు.