‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్‌ను స్వీకరించిన భూమన | Bhumana Karunakar Reddy Accepts Tdp Palla Srinivasa Rao Challenge | Sakshi
Sakshi News home page

‘రేపు ఎస్వీ గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్‌ను స్వీకరించిన భూమన

Apr 16 2025 8:31 PM | Updated on Apr 16 2025 9:04 PM

Bhumana Karunakar Reddy Accepts Tdp Palla Srinivasa Rao Challenge

సాక్షి, తిరుపతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు ఎస్వీ గోశాల వద్దకు వస్తున్నా, అక్కడ కలుద్దాం’’ అంటూ భూమన ప్రతిసవాల్‌ విసిరారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు.  రేపు రండి.. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు’’ అని భూమన మండిపడ్డారు.

కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్‌ కెమెరాల హల్‌చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.

వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement