అర్ధ వార్షిక మహాజన సభ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం అర్ధ వార్షిక మహాజన సభ సమావేశం నిర్వహించారు. బ్యాంకు కార్యకలాపాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. 2025 సెప్టెంబర్ నాటికి బ్యాంకు పరిపాలన నివేదికను పరిశీలించారు. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా ఆదాయ, వ్యయాలు, ఖర్చు అంచనాలను ఆమోదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.4,460 కోట్ల వ్యాపారాభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో రూ.1,260 కోట్ల డిపాజిట్లు సమీకరించడం, రూ.3,200 కోట్ల వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మంజూరైన వివిధ రకాల రుణాల బట్వాడాపై చర్చించారు. అలాగే సంఘాల్లో హెచ్ఆర్ పాలసీ అమలు, ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని తీర్మానించారు. సంఘాల్లో ఉన్న అసమతుల్యతలను తగ్గించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మహాజన సభలో చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి ఎస్.లక్ష్మి, సీఈవో శంకర బాబు, జీఎంలు, డీజీఎంలు, ఏజీఎంలు తదితరుల సభ్యులు పాల్గొన్నారు.


