విజయనగరం గంటస్తంభం: పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని, తొలుత భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం భూముల రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, 22–ఎ దరఖాస్తులు, రెవెన్యూ వన్, పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారం వంటి వాటిపై సమీక్షించారు. ఆగస్టు నెలకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను మూడు రోజుల్లోగా పంపిణీ చేయాలని, సెప్టెంబరు నెలాఖరులోపు 50 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి కావాలని, ఫేజ్–3లో పెండింగ్లోని పాస్పుస్తకాల పంపిణీని కూడా వెంటనే చేపట్టాలన్నారు.
ప్రజాసమస్యలను పరిష్కరించాలి..
జీవో నంబరు 444 కింద వీఆర్వో, ఎంపీడీవో లాగిన్లలో ఉన్న 22–ఎ దరఖాస్తులను ఈ నెలలోనే పరిష్కరించాలని, ఏ దరఖాస్తు పెండింగ్లో ఉండకూడదని అధికారులకు జేసీ స్పష్టంచేశారు. రెవెన్యూ వన్ స్కానింగ్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఐదో స్ధానంలో ఉందని, మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి, మరింత మెరుగైన ర్యాంకు సాధించాలన్నారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలన్నారు. సమావేశానికి డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, సర్వే ఏడీ విజయ్కుమార్, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఆన్లైన్లో హాజరయ్యారు.
పట్టాదారు పాసుపుస్తకాల
పంపిణీని పూర్తి చేయాలి
అధికారులతో సమీక్ష సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్


