పార్వతీపురం: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఉపాధి కోరేవారిగా కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి లక్షాధికారులు కావాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన మహిళా పారిశ్రామకవేత్తల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భోగా పురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్తపరిశ్రమల స్థాపనకు అవసరమైన రుణాలు, నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. మహిళల ఆదాయం పెరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ప్రభుత్వ పథకా లను వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సీహెచ్. ప్రభావతి, ఎల్డీఎం ఎస్.సోమశేఖర్, మెప్మా అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొత్త పరిశ్రమలతో జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం
జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించి జిల్లా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీపీ) సమావేశంలో ఆయన పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు, ఎగుమతుల ప్రోత్సాహంపై సమీక్షించారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతోపాటు యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి స్థానిక వనరుల ఆధారంగా విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటుచేయాలని సూచించారు. సమావేశంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ టి.సీతారాం, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు.


