అడ్డుకుని నిలదీసిన గ్రామస్తులు
బొల్లాపల్లి: రాత్రిళ్లు అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్న ఘటన బొల్లాపల్లి మండలం మూగ చింతలపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని మూగచింతల పాలెం గ్రామ సమీపంలో చెరువు మట్టిని రాత్రిళ్లు అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకొని గ్రామస్తులు నిలదీశారు. చెరువు మట్టిని 10 నుంచి 12 టిప్పర్లలో అక్రమంగా తరలించేందుకు సిద్ధమైన విషయం తెలుసుకున్న గ్రామస్తులు మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. అక్రమ మట్టిని తరలింపునకు పాల్పడిన వారిని నిలదీశారు. మట్టి తరలింపునకు అనుమతి ఉందని డ్రైవర్లు చెప్పినా.. అధికారుల అనుమతి ఉంటే రాత్రిళ్లు తరలించాల్సిన అవసరం ఏముందని నిలదీయడంతో మట్టిని నింపుకొన్న టిప్పర్లు అక్కడ నుంచి తరలి వెళ్లగా.. మట్టిని నింపని టిప్పర్లు ఖాళీగా వెళ్లాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో గత రెండేళ్ల నుంచి చెరువులు, బంజర భూముల్లో మట్టిని అక్రమంగా తరలించి రూ.లక్షలు అర్జించారన్నారు. అక్రమ మట్టి తరలింపు పై సంబంధిత శాఖల అధికారులకు సమాచారం ఇచ్చామని, అధికారులనుంచి స్పందనలేదని గ్రామస్తులు చెబున్నారు. చెరువుల మట్టిని గ్రామస్తుల అవసరార్థం మాత్రమే ఉపయోగించుకోవాలని గతంలో పెద్దల సమక్షంలో తీర్మానం చేసుకున్నామని, అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేత అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


