మహంకాళికి నిమ్మకాయల అలంకరణ | - | Sakshi
Sakshi News home page

మహంకాళికి నిమ్మకాయల అలంకరణ

Jul 20 2026 1:32 AM | Updated on Jul 20 2026 1:32 AM

మహంకాళికి నిమ్మకాయల అలంకరణ క్విజ్‌పోటీల్లో డాక్టర్‌ కృష్ణప్రియ ప్రతిభ ఆషాఢ వైభవం.. ‘ఇంద్ర’వైభోగం ఉదయం నుంచి రాత్రి వరకూ సారె సమర్పణలు

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకరించారు. భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి, మొక్కులు తీర్చుకున్నారు. అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

జాతీయ స్థాయిలో

రెండోస్థానం కైవసం

గుంటూరు మెడికల్‌: గుంటూరు మెడికల్‌ కాలేజ్‌, గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్‌ పోలవరపు కృష్ణప్రియ క్విజ్‌ పోటీల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. న్యూఢిల్లీలో శనివారం ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు జాతీయ స్థాయి క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఏపీ తరఫున గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ నుంచి పాల్గొన్న డాక్టర్‌ కృష్ణప్రియ జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచారు. ఇటీవల ఏపీలో జరిగిన రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీల్లో స్టేట్‌ ఫస్ట్‌ సాధించిన డాక్టర్‌ కృష్ణప్రియ జాతీయ స్థాయిలో చేరుకున్నారు. ఆదివారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌వీ సుందరాచారి, న్యూరాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. గాజుల రామకృష్ణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అజ్మ, పలువురు పీజీ వైద్య విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు. డాక్టర్‌ గాజుల రామకృష్ణ 2014లో జాతీయ స్థాయి క్విజ్‌ పోటీల్లో ప్రథమస్థానం సాధించి రికార్డు సృష్టించగా.. నేడు గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీకి చెందిన డాక్టర్‌ కృష్ణప్రియ రెండో స్థానంలో నిలిచారు. తద్వారా గుంటూరు వైద్య కళాశాల పేరు మరోమారు జాతీయస్థాయిలో మారుమోగేలా చేశారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు సారెను సమర్పించాయి. జగన్మాత దుర్గమ్మను భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, మిఠాయిలను సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, తిరిగి సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 9.30 గంటల వరకు సారె సమర్పణలు కొనసాగాయి. దీంతో ఉదయాస్తమాన సేవగా సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుందా అనే భావన భక్తుల్లో కలిగింది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.

అన్ని టికెట్ల విక్రయాలు రద్దు..

గతంలో శుక్రవారం, ఆదివారాల్లో కేవలం అంతరాలయ దర్శనాలను మాత్రమే రద్దు చేసేవారు. అయితే ఆదివారం భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని టికెట్ల విక్రయాలను రద్దు చేసి ఉచితంగా ఆయా క్యూలైన్‌ మార్గాల్లో భక్తులను దర్శనానికి అనుమతించారు. ముందుగా ఆన్‌లైన్‌లో రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక సమాయాన్ని కేటాయించారు. వారికి మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement