ప్రైవేట్ వారికి ‘రిజిస్ట్రేషన్ సేవలు’ తగదు
ఉపాధి కోల్పోతామంటున్న దస్తావేజు లేఖరులు
జిల్లా వ్యాప్తంగా 10 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెన్డౌన్
సత్తెనపల్లి: జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేసి తమ పొట్టలు కొట్టొదంటూ దస్తావేజు లేఖరులు సోమవారం పెన్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, పిడుగురాళ్ల, అమరావతి, క్రోసూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఆయా సబ్ రిజిస్ట్రార్లకు వినతి పత్రాలను అందించారు. క్రయ, విక్రయదారులు కూడా మద్దతు పలికారు. సత్తెనపల్లిలో 4, నరసరావుపేట 2, అమరావతిలో 2 స్లాట్లు బుక్ అయినప్పటికీ జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ సులభరీతిలో రిజిస్ట్రేషన్ సేవల పేరిట రిజిస్ట్రేషన్ సేవ కేంద్రాలు(ఆర్ఎస్కేలు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రిజిస్ట్రేషన్ సేవలు ఇకపై పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో చేపడతారన్నారు. సేవలు వేగంగా అందుతాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్తావేజు రాయడం అనేది కేవలం కంప్యూటర్లో డేటా నమోదు చేయడం మాత్రమే కాదని, ఈ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆస్తి వివాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
తెల్ల కాగితాలపైనే రిజిస్ట్రేషన్ సేవలు..
ప్రస్తుతం రిజిస్ట్రేషను సేవలకు స్టాంపులు వాడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ స్టాంపులను ప్రవేశపెడితే ఎల్లో మీడియా నానా యాగీ చేసిందన్నారు. అమలు చేయని తెల్లకాగితలపై రిజిస్ట్రేషన్ సేవల విధానాన్ని ఎల్లోమీడియా, చంద్రబాబు తెగ ప్రచారం చేసి ప్రజల్లో అయోమయం నింపారన్నారు. ప్రస్తుతం ఆర్ఎస్కేలలో తెల్లకాగితాలపైనే రిజిస్ట్రేషన్ చేసేలా సంస్కరణల పేరుతో ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హమన్నారు. ఇప్ప టికై నా ప్రభుత్వం పునరాలోచించి జీవో నంబరు 396 రద్దు చేయాలన్నారు. పెన్డౌన్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.


