నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రకాష్నగర్లోని టౌన్హాల్లో పల్నాడు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్– 2026 అవార్డుల ప్రదానోత్సవం సోమవారం నిర్వహించారు. టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.20 వేల నగదు, పతకం, ధ్రువపత్రం అందించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి జిల్లా వ్యాప్తంగా 186 మంది టెన్త్, 38 మంది ఇంటర్ విద్యార్థులు ఈ పురస్కారాలు పొందారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ.... ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సాహంతోపాటు ఆర్థిక సాయం అందించేందుకు అవార్డులను ఇస్తున్నట్టు తెలిపారు. సర్కార్ పాఠశాలలు, కళాశాలల్లో చదివిన వారు ఎంపిక తీరుతో నష్టపోయారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో టెన్త్ విద్యార్థుల్లో 186 మందిని ఎంపిక చేశారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కేవలం 81 మంది. మిగతావారు ప్రైవేటు బడుల్లో చదివారు. ఇంటర్లోనూ 38 మందిని ఎంపిక చేయగా ప్రభుత్వ కళాశాలల వారు 9 మందేనని పలువురు గుర్తుచేస్తున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జి.వి.ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గంగాధర్, శిల్పకళా సంస్థ చైర్మన్ మంజులరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంప్రసాద్, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.


