పాత పంటల బీమా పథకాన్ని తీసుకువస్తేనే రైతులకు మేలు మాజీ ఎమ్మెల్యే నంబూరు
సాక్షి, నరసరావుపేట: ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు నష్టం జరిగిన సమయంలో ఆసరాగా నిలవాల్సిన పంటల బీమా పథకం కూటమి ప్రభుత్వంలో నిర్వీర్యమైందని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో... అనుకోకుండా సంభవించే ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ పొందటానికి పంటల బీమా అనేది మంచి ఉపశమనం పొందే అవకాశముందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం రైతులకు ఉపయోగపడాల్సిన పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఉపయోగపడకుండా చేసిందన్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్షకుల మేలుకోరే ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల పక్షాన బీమాను చెల్లించి వారిని కష్టకాలంలో ఆదుకున్నారన్నారు. అయితే ఆ పథకాన్ని రద్దు చేసి రైతులే ప్రీమియం కట్టేలా నిబంధనలు మార్చి జరిగిన నష్టానికి న్యాయమైన పరిహారం దక్కే హక్కు లేకుండా చేశారన్నారు. గత రెండేళ్లలో వరుస ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా వారికి బీమా ధీమాను ఇవ్వలేదన్నారు. దీంతో రైతులు రైతులు బీమా కట్టడానికి ముందుకు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు.


