యాప్లో నమోదు చేసుకుంటేనే ఎరువులు అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయలేని ప్రభుత్వం ప్రైవేట్ డీలర్లకు లబ్ధి చేకూర్చేందుకే అంటున్న రైతులు ధరలు పెరగడంతో లబోదిబోమంటున్న అన్నదాతలు కర్షకుల కష్టాలు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో ఖరీఫ్ సాగు లక్ష్యం 1,60,138 హెక్టార్లు
జిల్లా సమాచారం
సత్తెనపల్లి: ఎరువులు కావాలంటే రైతులు ముందుగా ఏపీ ఏఐఎంఎస్ యాప్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే రైతులకు ఇబ్బందికరంగా తయారైంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగానే ఉన్నాయి. దీనికి తోడు ఇక మీదట సాగు చేసే పంటలను ముందస్తుగా రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించాలని, తర్వాతే ఎంత మేర ఎరువులు ఇవ్వాలో నిర్ణయిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పైగా భూములు వెబ్ల్యాండ్లో ఉంటేనే ఎరువులు ఇస్తామని లేకుంటే ఇవ్వమని తెగేసి చెబుతున్నారు.
నమోదైన మేరకే...
గత ఏడాదిలో ఏ పంట సాగు చేశారు .. ప్రస్తుతం ఏ పంటను సాగు చేయనున్నారు.. పంట మార్పిడి చేస్తారా.. లేక అదే సాగు చేస్తారా .. అనే వివరాలను రైతు సేవా కేంద్రంలో నమోదు చేయించిన తర్వాతే రైతు పేరు, ఆధార్, భూమి రికార్డులను ఏపీ ఏఐఎంఎస్ యాప్లో సిబ్బంది పొందుపరుస్తారు. అనంతరం వివరాలు తీసుకొని ఏ ఎరువుల దుకాణం వద్దకు వెళ్లినా యాప్ లో నమోదైన మేరకు ఎరువులు ఇస్తారు. అదీ నమోదు చేసిన ఎరువులను ఒక్కసారిగా ఇవ్వరు. మూడు విడతలుగా అందజేస్తారు. ఒక్కో విడతకు 20 రోజుల నుంచి 30 రోజుల వ్యవధి ఉంటుంది. అధికంగా కావాలంటే ఎరువుల దుకాణంలో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని రైతులు వాపోతున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయలేకే ప్రభుత్వం ఇప్పుడు యాప్ ఎత్తుగడ వేసిందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసేవారితో పాటు ఏడాది పాటు మూడు పంటలు సాగు చేసే రైతుల కు ఈ ఎరువులు ఏ మూలకు సరిపోవు.
ఖరీఫ్ సాగు లక్ష్యం : 1,60,138 హెక్టార్లు
ఖరీఫ్కు అవసరమైన
ఎరువులు : 1,08,636 మెట్రిక్ టన్నులు
అందుబటులో
ఉన్న ఎరువులు : 73,359 మెట్రిక్ టన్నులు


