కేబినెట్ మంత్రులకు ప్రధాని కార్యాలయం ‘పనితీరు నివేదిక’
సీల్డ్ కవర్లలో నివేదికలు అందజేసిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: సభలు, దంచికొట్టే ప్రసంగాల కాలం నుంచి రాజకీయాలు, రాజకీయ చర్చలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికలపైకి మారుతున్నాయి. యువతతో పార్టీ, ప్రభుత్వ సంబంధాలను బలోపేతం చేసుకోవాలంటే సోషల్ మీడియానే అత్యంత ప్రధానమని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా వేదికల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది.
ప్రధాని సహా కేంద్ర మంత్రులందరూ ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ‘ఎక్స్’అనే 4 ప్రధాన వేదికల ద్వారా ప్రజలతో మమేకం కావాలని, ఎల్లప్పుడూ అప్డేట్స్ ఇస్తూ సోషల్మీడియాలో క్రియాశీలకంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సోషల్ మీడియా మాధ్యమాల్లో కేంద్ర మంత్రుల పనితీరు, క్రియాశీలత ఎలా ఉందనే దానిపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక అధ్యయనం చేయించింది. నివేదికను సిద్ధం చేసింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ ఈ నివేదికలను సీల్డ్ కవర్లలో మంత్రులకు వ్యక్తిగతంగా అందజేశారు.
సమగ్ర విశ్లేషణతో తుది నివేదిక..
ఈ రిపోర్టులో మే 1 నుంచి ఆగస్టు 15 వరకు మంత్రులు సోషల్ మీడియాలోని నాలుగు వేదికలపై చూపిన క్రియాశీలతను సమగ్రంగా విశ్లేషించారు. మంత్రులు పెట్టిన పోస్టులు, వివిధ అంశాలపై వారి వైఖరి, కామెంట్లు, స్పందనలను ఇందులో లెక్కగట్టారు. తోటి మంత్రులతో పోలిస్తే, అలాగే ప్రతిపక్ష నేతలతో పోలిస్తే సదరు మంత్రి ఏ స్థాయిలో యాక్టివ్గా ఉన్నారు? అనే దానికి సంబంధించిన నిష్పాక్షికమైన, పోల్చదగిన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయం రూపొందించినట్లు సమాచారం.
ఆధునిక ప్రచార సాధనాలపై ప్రధాని దిశానిర్దేశం..
ఈ రిపోర్టును మంత్రులంతా తీవ్రంగా, బాధ్యతగా తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలిసింది. ఆధునిక సమాచార వ్యవస్థలైన ఈ సోషల్ మీడియా వేదికలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాయో మంత్రులకు ప్రధాని మరోసారి సుదీర్ఘంగా వివరించారు. ఈ డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వాడుకోవాలన్నారు. సోషల్ మీడియా ప్రచారంతోపాటు, యాక్టివ్గా ఉండటంలోనూ ప్రధాని మోదీ స్వయంగా ఆదర్శంగా నిలిచారు. పీఎంఓ రూపొందించిన ఈ ‘పర్ఫార్మెన్స్ రిపోర్ట్’ర్యాంకింగ్లో ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ముందు వరుసలో నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారని తెలిసింది.


