కావాలనే నిప్పుపెట్టిన బాలిక.. 5 అంతస్తుల భవనం బూడిద | Tughlakabad fire that killed 3 was deliberate arson | Sakshi
Sakshi News home page

కావాలనే నిప్పుపెట్టిన బాలిక.. 5 అంతస్తుల భవనం బూడిద

Jun 14 2026 4:19 PM | Updated on Jun 14 2026 5:16 PM

Tughlakabad fire that killed 3 was deliberate arson

Saritha (27)

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో ఇటీవల ఐదు అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం కాదని, వ్యక్తిగత కక్షతో ఉద్దేశపూర్వకంగా పెట్టిన నిప్పేనని ఢిల్లీ పోలీసులు ఆదివారం తెలిపారు.

తుగ్లకాబాద్‌లోని టీకేడీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఉన్న నివాస భవనంలో జూన్ 12న మంటలు చెలరేగాయి. తొలుత ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించారు. అయితే, తర్వాత పోలీసులు సేకరించిన ఆధారాలను విశ్లేషించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్టు తేలింది.

మంటలు చెలరేగే ముందు ఓ మహిళ భవనంలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించడంతో వాటిని పరిశీలించిన తర్వాత భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

నిప్పు ఎందుకు అంటించింది? 
దర్యాప్తు సమయంలో గోవింద్‌పురిలోని నవజీవన్ క్యాంప్‌కు చెందిన 17 ఏళ్ల బాలికను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గోవింద్‌పురిలోని గిరినగర్ నివాసి సరిత (27) ప్రేరేపించడంతో తాను ఈ పని చేసినట్టు బాలిక ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.

“5వ అంతస్తులో నివసించే దీపక్‌కు చెందిన స్కూటీకి నిప్పు పెట్టేందుకు సరిత పెట్రోల్, అగ్గిపెట్టె ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. డబ్బు వివాదం కారణంగానే ఇలా చేయాలని చెప్పిందని” ఢిల్లీ పోలీసులు తెలిపారు.

తదుపరి దర్యాప్తులో నవజీవన్ క్యాంప్ వాసులు నిరంజన్ (33), అతని సోదరుడు రాజ్‌కుమార్ (27) సూచనల మేరకు సరిత వ్యవహరించినట్టు తేలింది. వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు ఈ ముగ్గురు కలిసి అగ్నిప్రమాదానికి కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు.

నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యం మరణానికి కారణం కావడం, నిప్పుతో నష్టం కలిగించడం, రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించడం వంటి తీవ్రమైన అభియోగాలను కేసులో పోలీసులు చేర్చారు. బాలిక సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా, ఈ ఘటనపై శుక్రవారం ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ, “జూన్ 11-12 అర్ధరాత్రి దాటాక 2.24 గంటలకు గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌కు తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లోని 5 అంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్టు పీసీఆర్ కాల్ వచ్చింది. 

దట్టమైన పొగలో చిక్కుకున్న ఎనిమిది మందిని సహాయక బృందాలు బయటకు తీసి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. 22 ఏళ్ల యువకుడు, ఇద్దరు మహిళలతో కలిపి ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది” అని తెలిపారు.

అగ్నిమాపక విభాగ అధికారి యశ్వంత్ మీనా మాట్లాడుతూ, “భవనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న 3 స్కూటీలు, 2 బైకులు, ఓ సైకిల్‌లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 అంతస్తుల వరకూ వ్యాపించింది. గ్రౌండ్, ఒకటో, రెండో అంతస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

మిగతా అంతస్తులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది డాబాపైకి చేరుకుని, డాబా గేటు తాళం కత్తిరించి భవనంలోకి ప్రవేశించారు. ఇద్దరు బాలికలను రక్షించి క్యాట్స్, పీసీఆర్ సిబ్బంది ద్వారా ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఎనిమిది మందిని రక్షించారు” అని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement