ముంబైలోని ఓ పాఠశాల బస్సుపై చెట్టు విరిగిపడింది. దీంతో బస్సులోని ఓ విద్యార్థి మృతి చెందగా, మరో 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు వస్తున్నాయి. అందుకే చెట్టు కూలినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం చెంబూర్లోని రోడ్ నం.11లో జరిగింది. ఆ సమయంలో ఆ స్కూల్ వ్యాన్లో మొత్తం 13 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన విద్యార్థుల్లో కొందరిని జైన్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో చిక్కుకుపోయిన ఒక చిన్నారిని బయటకు తీసేందుకు అత్యవసర సహాయ బృందాలు కూలిపోయిన చెట్టును కోస్తున్నాయి.
ఆ ప్రాంత ప్రజలు, చెట్ల కొమ్మలను కత్తిరించాలని లేదా తొలగించాలని కోరుతూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు పలుసార్లు లేఖలు రాశామని చెప్పారు. ఇంతకుముందు కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగిందని తెలిపారు. పలుసార్లు హెచ్చరించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు.
ఇదిలా ఉండగా, ముంబై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.


