ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే! | She Invited Trouble Allahabad High Court Again In Discussion | Sakshi
Sakshi News home page

ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే!

Apr 10 2025 4:48 PM | Updated on Apr 10 2025 5:11 PM

She Invited Trouble Allahabad High Court Again In Discussion

వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రావంటూ వివాదాస్పద తీర్పు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్‌).. మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ అత్యాచార కేసులో బాధితురాలిది కూడా తప్పు ఉందని పేర్కొంటూ నిందితుడికి ఏకంగా బెయిల్‌ మంజూరు చేసింది.

లక్నో: ఢిల్లీలో ఉంటూ పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని తన క్లాస్‌మేట్‌ అత్యాచారం చేశాడని కేసు పెట్టింది.  .. మద్యం మత్తులో ఉన్న తనను అతని బంధువుల ఇంటికి తీసుకెళ్లి రెండుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే సాక్ష్యాలు పరిశీలనలో అది అబద్ధమని, పరస్పర అంగీకారంతో ఇద్దరూ కలిశారని నిందితుడి తరఫు లాయర్‌ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ధర్మాసనం కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది.

ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.

పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్‌ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటన కిందటి ఏడాది సెప్టెంబర్‌లో జరిగింది. పీజీ చదువుతున్న బాధితురాలిని ఆమె స్నేహితులు హౌజ్‌ ఖాస్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఆహ్వానించారు. అయితే అర్ధరాత్రి 3గం.దాకా ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె చిత్తుగా తాగింది. ఈ క్రమంలో మత్తులో ఉన్న ఆమె తన గదికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓ స్నేహితుడిని అతని ఇంటికి తీసుకెళ్లాలని ఆమె కోరింది. అయితే.. బాగా మత్తులో ఉన్న ఆమెను నిందితుడు తన బంధవులు ప్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నది ఆమె ఆరోపణ. ఈ కేసులో కిందటి ఏడాది డిసెంబర్‌ నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు. ఇక.. ఈ కేసులో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరీ నిందితుడికి అలహాబాద్‌ హైకోర్టు బెంచ్‌ బెయిల్‌ మంజూరు చేసింది మార్చి 11వ తేదీనే. కానీ, పలు ఆంగ్ల మీడియా వరుస కథనాలతో ఇప్పుడు హైలైట్‌ అవుతోంది. అంటే..

ఇదే కోర్టుకు చెందిన జస్టిస్‌ రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా ఇచ్చిన వివాదాస్పద తీర్పు కంటే ముందు ఈ కేసు విచారణ జరిగిందన్నమాట!. మార్చి 17వ తేదీన ఓ మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్‌ రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు.  తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది కూడా.

Advertisement
 
Advertisement
Advertisement