ముంబై: ఇటీవల అమెరికా వెళ్లిన బాలీవుడ్ దర్శకురాలు, ఫ్యాషన్ స్టయిలిస్ట్ రియా కపూర్ అద్దెకు తెచ్చుకున్న రూ.1.35 కోట్ల విలువైన వజ్రపు చెవి రింగులను పోగొట్టుకున్నారు. ఈ మేరకు ఆమె సన్నిహితురాలు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై సహర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. న్యూయార్క్లో జరిగే మెట్ గాలాలో పాల్గొనేందుకు రియా కపూర్ ముంబైలోని మెహతా జువెల్లర్స్ అండ్ గోయెంకా జువెల్లర్స్ వద్ద ఖరీదైన రెండు జతల చెవి రింగులను అద్దెకు తీసుకున్నారు. వాటిని సవ్లీన్ సింగ్కు ఇవ్వగా, ఆమె తన బ్యాగులో పెట్టుకున్నారు.
రియా, సవ్లీన్ బృందం ఏప్రిల్ 17వ తేదీన ముంబై నుంచి దుబాయ్కి, అక్కడి నుంచి న్యూయార్క్కు 28న చేరుకున్నారు. న్యూయార్క్లో బస చేసిన పియెర్రె హోటల్కు వెళ్లాక బ్యాగు తెరిచి చూడగా రెండు వేర్వేరు బాక్సుల్లో ఉన్న చెవి రింగులు కనిపించలేదు. వీటితోపాటు సుమారు రూ.లక్షన్నర విలువైన మరో రెండు జతల చెవిరింగులు బ్యాగులో లేవు. తిరిగి ముంబై వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆభరణాలు ముంబైలో మాయమయ్యాయా లేక దుబాయ్, అమెరికాలో ఎవరైనా దొంగిలించారా అనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు శనివారం తెలిపారు.


