
న్యూఢిల్లీ: చిన్నారుల పాట విని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కరిగిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ముర్ము శుక్రవారం 67వ బర్త్డే జరుపుకున్నారు. డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్కు వెళ్లిన ఆమెకు చిన్నారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అంధులైన చిన్నారులు రాష్ట్రపతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పాట ఆలపించారు.
‘ఈ రోజులు మళ్లీ మళ్లీ రావాలి, నా హృదయం మళ్లీ మళ్లీ పాడాలి, మీరు వెయ్యేళ్లు జీవించాలి, ఇదే నా కోరిక, హ్యాపీ బర్త్ డే టూ యూ.. (బార్ బార్ దిన్ ఏ ఆయే, బార్ బార్ దిల్ యే గాయే, తు జియో హజారోం సాల్, యే మేరీ హై ఆర్జూ...)అంటూ సాగిన పాట విని ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయారు. ‘వాళ్లెంతో అందంగా, హృద్యంగా పాడారు. నేనెంతో ఉద్వేగానికి లోనయ్యా. వారి పాటవిని సంతోషంతో ఉప్పొంగిపోయా.
నా కళ్ల వెంట నీళ్లు ఆగకుండా వచ్చేస్తూనే ఉన్నాయి’అని ఆమె పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి ముర్ముకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రశంసించారు. ఒడిశాలోని మయూర్భంజ్లో 1958 జూన్ 20వ తేదీన ముర్ము జన్మించారు. దేశానికి 15వ రాష్ట్రపతిగా 2022 జూలై 25న బాధ్యతలు చేపట్టారు.