వర్షాకాల సమావేశాల నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన(ఉద్ధవ్)కు చెందిన ఆరుగురు ఎంపీలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో విలీనం చేయడానికి అంగీకారం తెలియజేశారు. అలాగే నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ)లో చేరిన 20 మంది తిరుగుబాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఎంపీలకు సభలో ప్రత్యేక సీటింగ్ కేటాయించడానికి ఆమోదం తెలిపారు.
ఆరుగురు ఎంపీలు విలీనం కావడంతో షిండే నాయకత్వంలోని శివసేన బలం ఏడు నుంచి 13కు పెరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు తమ మాతృపార్టీకి సంబంధం లేకుండా సభలో ప్రత్యేకంగా ఆసీనులవుతారని వెల్లడించాయి. తమను నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో అంతర్భాగంగా గుర్తించాలన్న టీఎంసీ రెబల్ ఎంపీల వినతిపై స్పీకర్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు.
తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్), టీఎంసీ నాయకత్వం విజ్ఞప్తి చేయగా, స్పీకర్ దానిపై స్పందించలేదు. తాజా సమీకరణాలతో స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న తాజా నిర్ణయంలో లోక్సభలో అధికార ఎన్డీయే బలం మరింత పెరుగనుంది. సభలో ప్రస్తుతం 540 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సభలో ప్రస్తుతం ఎన్డీయే బలం 318 కాగా>, విపక్ష ఇండియా కూటమిలో 181 మంది ఎంపీలు ఉన్నారు. 41 మంది ఇతర పార్టీలకు చెందినవారు.


