
అధికారి తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అలాగే న్యాయస్థానం వాళ్ళు అనుకోవాలిగానీ ఏ అంశం మీదైనా నోటీసులు ఇవ్వగలరు.. చొక్కా గుండీలు పెట్టుకోలేదని.. నల్లకళ్లజోడు పెట్టుకున్నావని.. టిప్ టాప్ గా తయారై కోర్టుకు వచ్చావని కూడా శిక్ష విధించగలరు.. నోటీసు ఇవ్వగలరు. పాపం ఉత్తరప్రదేశ్ లోని గొండా జిల్లాలో ఇలాగే ఓ కోర్టు అటెండర్ తనకు తాజా స్నాక్స్ పెట్టలేదని.. చెడిపోయిన మిక్చర్ ఇచ్చాడన్న కారణంతో సదరు జడ్జి కోపానికి వచ్చి ఏకంగా ఆ ఉద్యోగికి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇదిప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా కోర్టులో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి నాలుగురోజుల క్రితం మధ్యాహ్న విరామ సమయంలో, గోండాలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో కలిశారు. వారిద్దరూ కాసేపు ఛాంబర్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అతిథికి చాయ్ బిస్కెట్స్ అందించాలని కోర్టు అటెండర్ ను సెషన్స్ జడ్జి చెప్పారు.
అయితే పాపం ఆ ఉద్యోగి కేవలం చాయ్ తీసుకొచ్చాడు. దీంతో జడ్జిగారు కోపంతో బిస్కెట్స్ తీసుకురమ్మని ఆదేశించారు. వెంటనే ఆ అటెండర్ పరుగెత్తుకువెళ్లి బిస్కెట్స్ బదులు దాల్మోత్ అనే మిక్చర్ లాంటిది తెచ్చి ఇచ్చాడు. అయితే అది నాణ్యత లేకపోగా చెడిపోయిన వాసనా వచ్చింది. దీంతో జడ్జిగారికి చిర్రెత్తుకొచ్చింది.. వెంటనే టింగ్ టింగ్ అని బెల్లు కొట్టి టైపిస్టును పిలిచి ఈ అటెండర్ నాకు సరిగా స్నాక్స్ ఇవ్వలేదు.. ముందు ఆయనకు నోటీస్ టైప్ చేసివ్వు.. అయన దానికి సమాధానం ఇచ్చుకుంటాడో ఉద్యోగం మనుకుంటాడో చూద్దాం అని హుకుం జారే చేసారు. అయన ఆదేశించిన మరుక్షణం ఉద్యోగి పేరిట నోటీస్ సిద్ధమైంది.
ఇంతకూ ఆ నోటీసులో ఏముందంటే..
“నేను బిస్కెట్లు తీసుకురమ్మన్నాను. కానీ నీవు బిస్కెట్లు తీసుకురాకుండా, బదులుగా చెడిపోయిన దాల్మోత్ను సర్వ్ చేసావు. అయితే, రెండు డబ్బాల్లో మంచి నాణ్యత గల బిస్కెట్లు క్యాబినెట్లో సిద్ధంగా ఉండగా కూడా, నీవు అవన్నీ విస్మరించి, బయటపడేయాల్సిన స్థితిలో ఉన్న దాల్మోత్ను ఇచ్చావు. ఇది గౌరవానికి భంగం కలిగించే చర్యగా, తీవ్రమైన నిర్లక్ష్యంగా భావిస్తున్నాం. దీనికి నువ్వు వివరణ ఇవ్వాల్సిందే అంటూ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.. అయ్యో జడ్జిగారికి కోపం వస్తే ఏమవుతుందో చూసారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు
-సిమ్మాదిరప్పన్న