రాంచీలో విస్తరిస్తున్న విద్యార్థుల నిరసనలు
నిరాహార దీక్షలో మరో ఐదుగురు
చర్చలకు సిద్ధమన్న జార్ఖండ్ సీఎం సోరెన్
ఉద్యమకారులకు మద్దతు ప్రకటించిన దీప్కే
రాంచీ/ఛత్రపతి శంభాజీనగర్: జార్ఖండ్ పోటీ పరీక్షల్లో అక్రమాలకు చరమగీతం పాడి పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తేవాలన్న డిమాండ్తో గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారులకు మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. బుధవారం రాంచీలోని జైపాల్సింగ్ ముండా స్టేడియంలో నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగార్థులు, ఉద్యమకారులకు మద్దతుగా పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు.
మరో ఐదుగురు ఉద్యమకారులు మంగళవారం రాత్రి నిరాహార దీక్షకు కూర్చున్నారు. ‘‘ఉద్యమానికి నైతిక బలాన్నిస్తూ ఇద్దరు మహిళలు సహా ఐదుగురు కొత్తగా దీక్షలో భాగస్వాములయ్యారు. డిమాండ్లను నెరవేర్చేదాకా మా పోరాటం ఆగదు’’అని జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(జేఎస్ఎస్సీ) సంస్కరణల మంచ్ అధికార ప్రతినిధి జీవన్ కుమార్ ప్రకటించారు.
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెట్టినందుకే నిరాహార దీక్షలో కూర్చున్నానని నాయకురాలు సబితా కుమారి తెలిపారు. బుధవారం ఉద్యమకారుల దీక్షాస్థలిలో జాతీయజెండాలతో ‘తిరంగా యాత్ర’కార్యక్రమం చేపట్టారు. ‘జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ రిఫార్మ్ ్స మంచ్’పేరుతో ఉద్యోగార్థులు జూలై 25వ తేదీన ఈ నిరసనను మొదలెట్టిన విషయం తెల్సిందే.
చర్చలకు ఆహ్వానించిన సర్కార్
చర్చలకు సిద్ధమని హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాంచీ సబ్ డివిజనల్ ఆఫీసర్ కుమార్ రజత్, అదనపు జిల్లా మేజి్రస్టేట్(శాంతిభద్రతలు) ధనంజయ్ కుమార్లు దీక్షా స్థలికి వచ్చారు. సీఎం అధికార నివాసంలో చర్చలకు రావాలని ఐదుగురు ఉద్యమనేతలను అధికారులు ఆహ్వానించారు.
కనీసం నీరైనా తాగండి: వాంగ్చుక్
లద్దాఖ్ సామాజిక వేత్త, ఇటీవల జంతర్మంతర్లో రోజులతరబడి నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్చుక్ బుధవారం రాంచీలో దీక్ష చేస్తున్న వారిని విజ్ఞప్తిచేశారు. దీక్షచేస్తున్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా(జేఎల్కేఎం) నేత దేవేంద్రనాథ్ మహతోతో వాంగ్చుక్ బుధవారం మాట్లాడారు. ‘‘మీ బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ స్థాయిలు పడిపోతున్నాయి.
ఆరోగ్యం విషమించకుండా ఉండాలంటే కనీసం నీళ్లు అయినా తాగండి. అప్పుడు ఎక్కువ రోజులు నిరాహార దీక్ష సాధ్యం’’అని సూచించారు. వాంగ్చుక్ విజ్ఞప్తిమేరకు మహతో తర్వాత కొద్దిగా నీళ్లు తాగారు. 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దుచేయాలని, జేఎస్ఎస్సీలో సంస్కరణలు తేవాలని, గత పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ లేదా ఇతర రాష్ట్రాల హైకోర్టు రిటైర్డ్ జడ్జీల నేతృత్వంలో స్వతంత్య్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్చేస్తున్నారు.
అంతటా పేపర్ లీకేజీలు: సీఎం
చర్చలకు సిద్ధమని సీఎం సోరెన్ ప్రకటించారు. ఉద్యమంపై ఆయన ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘‘యువత లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తాం. పోటీపరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ మా రాష్ట్రానికే పరిమితంకాలేదు. ఇది దేశవ్యాప్తంగా యువతకు సమస్యగా తయారైంది. రాత్రిపగలు రాష్ట్రంలో దర్యాప్తు కొనసాగుతోంది. నేరస్తులను జైలుకు పంపిస్తాం. దర్యాప్తుతో మేం ఆగిపోం. యువత సమస్యలకు పరిష్కారం చూపిస్తాం’’అని సోరెన్ అన్నారు.
జవాబుదారీగా ఉండాల్సిందే: దీప్కే
ఉద్యమిస్తున్న వందలాది మంది విద్యార్థులకు తమ సహాయసహకారాలు, తోడ్పాటు ఎప్పుడూ ఉంటాయని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చీఫ్ అభిజీత్ దీప్కే స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ పట్టణంలో సీజేపీ కీలక భేటీకి ముందు దీప్కే మీడియాతో మాట్లాడారు. ‘‘జార్ఖండ్లో పోటీపరీక్షల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేదాకా మేం ఊరుకోం. జవాబుదారీగా ఉంటామని ప్రకటించేదాకా ఒత్తిడిచేస్తూనే ఉంటాం. మేం జార్ఖండ్కు వెళ్తాం. ఆ విద్యార్తుల ప్రతి డిమాండ్ సాధనకు కలిసి పోరాడతాం’’అని దీప్కే ప్రకటించారు.


