తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. ఏడీజీపీ జయరామ్‌కు ఊరట | Jayaram Case Updates: Supreme Court Raps TN Madras High Court | Sakshi
Sakshi News home page

తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. ఏడీజీపీ జయరామ్‌కు ఊరట

Jun 18 2025 11:53 AM | Updated on Jun 18 2025 12:59 PM

Jayaram Case Updates: Supreme Court Raps TN Madras High Court

న్యూఢిల్లీ: తమిళనాడు అడిషనల్‌ డీజీపీ హెచ్‌ఎం జయరామ్‌(HM Jayaram)కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్టు వ్యవహారంలో మద్రాస్‌ హైకోర్టు  తీరుపై సుప్రీం కోర్టు కన్నెర్రజేసింది. కిడ్నాప్‌ కేసులో సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్‌ చేయాలని ఆదేశించడం ఏమేర సహేతకమని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అదే సమయంలో ఆయనపై సస్పెన్షన్‌ను వేటును ఎత్తేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మద్రాస్‌ హైకోర్టు(Madras HC) తన అరెస్ట్‌కు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జయరామ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిన్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. జయరామ్‌ తరఫు న్యాయవాది పలు అంశాలను ప్రస్తావించారు. తన క్లయింట్‌ జయరామ్‌ను అరెస్ట్‌ అయిన వెంటనే కస్టడీలోకి తీసుకున్నారని, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్‌ వేసిన 24 గంటల తర్వాతే విడుదల(జూన్‌ 17న) చేశారని బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం బెంచ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక అధికారిని అయోమయమైన ఆధారాల ఆధారంగా అరెస్ట్‌ చేయమని చెప్పడం ఏంటి?. ఇది ఎటువంటి న్యాయ ప్రక్రియకు సరిపోతుంది?. ఇది పరిపాలనా వ్యవస్థపైనా ప్రభావం చూపించే అంశమే కదా. అధికారులపై ఇలాంటి చర్యలు మానసికంగా దెబ్బతీసేలా ఉంటాయి’’అని అభిప్రాయపడింది.

అదే సమయంలో ఆయన్ని విధుల నుంచి సస్పెండ్‌ చేసిన తమిళనాడు ప్రభుత్వంపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఆయన్ని సస్పెండ్‌ చేయాల్సిన అవసరం ఏముంది?. విచారణకు సహకరిస్తున్నా కూడా చర్యలు తీసుకోవడం ఏంటి?.. సస్పెన్షన్‌ ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోండి.. అని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

ఏడీజీపీ జయరామ్‌ అరెస్టు వ్యవహారం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు వద్ద బాలుడి కిడ్నాప్ కేసులో గత సోమవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్‌మూర్తిపై కూడా ఆరోపణలున్నాయి. కోర్టు విచారణకు జయరామ్‌ హాజరు కాగా.. ఆ ప్రాంగణంలోనే ఆయన్ని అరెస్ట్‌ చేశారు. అరెస్టు అనంతరం ఏడీజీపీ జయరామన్‌ను హోంశాఖ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విచారణ సమయంలో.. ఈ కిడ్నాప్‌ కేసులో ఎమ్మెల్యే, పోలీస్‌ ఉన్నతాధికారి తీరుపై మద్రాసు హైకోర్టు  కన్నెర్ర చేసింది. ప్రజా ప్రతినిధులు న్యాయస్థానాలను (Kangaroo Courts)నడిపించడమేంటని? జగన్‌మూర్తికి తీవ్రంగా అక్షింతలు వేసింది.అలాగే.. ఏడీజీపీ జయరామన్‌ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు.. జగన్‌మూర్తి ఇప్పటికే ముందస్తు బెయిల్‌ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

జరిగింది ఇదే.. 
ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన ధనుష్‌(22) అనే యువకుడ్ని ఓ యువతి వివాహం చేసుకుంది. ఆ యువకుడిని పట్టుకుని తన కూతురిని తిరిగి తనకు అప్పగించాలంటూ ఆమె తండ్రి వనరాజా మాజీ కానిస్టేబుల్‌ అయిన మహేశ్వరి సాయం కోరాడు. దీంతో ఆమె ఏడీజీపీ జయరామ్‌ను సంప్రదించింది. ఆపై ఆ పంచాయితీ పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్‌మూర్తి చెంతకు చేరింది. 

ఈ క్రమంలో ధనుష్‌ కనిపించకపోవడంతో అతని 16 ఏళ్ల సోదరుడిని అమ్మాయి కుటుంబం కిడ్నాప్‌ చేశారు. అయితే ఈ కేసులో ఒత్తిళ్ల నేపథ్యంలో చివరకు ఆ బాలుడిని ఓ హెటల్‌ వద్ద వదిలేసి వెళ్లారు. అయితే ఆ బాలుడ్ని వదిలేసిన వాహనం ఏడీజీపీ జయరామ్‌ అధికారిక వాహనం కావడం, పైగా అందులో వనరాజా, మహేశ్వరి ఉండడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement