raps
-
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. ఏడీజీపీ జయరామ్కు ఊరట
న్యూఢిల్లీ: తమిళనాడు అడిషనల్ డీజీపీ హెచ్ఎం జయరామ్(HM Jayaram)కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్టు వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు తీరుపై సుప్రీం కోర్టు కన్నెర్రజేసింది. కిడ్నాప్ కేసులో సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయాలని ఆదేశించడం ఏమేర సహేతకమని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అదే సమయంలో ఆయనపై సస్పెన్షన్ను వేటును ఎత్తేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.మద్రాస్ హైకోర్టు(Madras HC) తన అరెస్ట్కు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జయరామ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై బుధవారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిన్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. జయరామ్ తరఫు న్యాయవాది పలు అంశాలను ప్రస్తావించారు. తన క్లయింట్ జయరామ్ను అరెస్ట్ అయిన వెంటనే కస్టడీలోకి తీసుకున్నారని, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేసిన 24 గంటల తర్వాతే విడుదల(జూన్ 17న) చేశారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక అధికారిని అయోమయమైన ఆధారాల ఆధారంగా అరెస్ట్ చేయమని చెప్పడం ఏంటి?. ఇది ఎటువంటి న్యాయ ప్రక్రియకు సరిపోతుంది?. ఇది పరిపాలనా వ్యవస్థపైనా ప్రభావం చూపించే అంశమే కదా. అధికారులపై ఇలాంటి చర్యలు మానసికంగా దెబ్బతీసేలా ఉంటాయి’’అని అభిప్రాయపడింది.అదే సమయంలో ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వంపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఆయన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది?. విచారణకు సహకరిస్తున్నా కూడా చర్యలు తీసుకోవడం ఏంటి?.. సస్పెన్షన్ ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోండి.. అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏడీజీపీ జయరామ్ అరెస్టు వ్యవహారం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు వద్ద బాలుడి కిడ్నాప్ కేసులో గత సోమవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్మూర్తిపై కూడా ఆరోపణలున్నాయి. కోర్టు విచారణకు జయరామ్ హాజరు కాగా.. ఆ ప్రాంగణంలోనే ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం ఏడీజీపీ జయరామన్ను హోంశాఖ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విచారణ సమయంలో.. ఈ కిడ్నాప్ కేసులో ఎమ్మెల్యే, పోలీస్ ఉన్నతాధికారి తీరుపై మద్రాసు హైకోర్టు కన్నెర్ర చేసింది. ప్రజా ప్రతినిధులు న్యాయస్థానాలను (Kangaroo Courts)నడిపించడమేంటని? జగన్మూర్తికి తీవ్రంగా అక్షింతలు వేసింది.అలాగే.. ఏడీజీపీ జయరామన్ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు.. జగన్మూర్తి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.జరిగింది ఇదే.. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ధనుష్(22) అనే యువకుడ్ని ఓ యువతి వివాహం చేసుకుంది. ఆ యువకుడిని పట్టుకుని తన కూతురిని తిరిగి తనకు అప్పగించాలంటూ ఆమె తండ్రి వనరాజా మాజీ కానిస్టేబుల్ అయిన మహేశ్వరి సాయం కోరాడు. దీంతో ఆమె ఏడీజీపీ జయరామ్ను సంప్రదించింది. ఆపై ఆ పంచాయితీ పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్మూర్తి చెంతకు చేరింది. ఈ క్రమంలో ధనుష్ కనిపించకపోవడంతో అతని 16 ఏళ్ల సోదరుడిని అమ్మాయి కుటుంబం కిడ్నాప్ చేశారు. అయితే ఈ కేసులో ఒత్తిళ్ల నేపథ్యంలో చివరకు ఆ బాలుడిని ఓ హెటల్ వద్ద వదిలేసి వెళ్లారు. అయితే ఆ బాలుడ్ని వదిలేసిన వాహనం ఏడీజీపీ జయరామ్ అధికారిక వాహనం కావడం, పైగా అందులో వనరాజా, మహేశ్వరి ఉండడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. -
సొంత ప్రపంచంలో బతుకుతున్నారు.. బాబా రాందేవ్పై కోర్టు అసహనం
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev) పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హమ్దార్డ్ సంస్థకి చెందిన రూ అఫ్జాపై మరో వీడియో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అలా చేయకూడదని ఆదేశించినప్పటికీ.. అవమానకరమైన వ్యాఖ్యలతో రూ అఫ్జాపై రామ్దేవ్ మరో కొత్త వీడియోను రూపొందించారని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని పేర్కొంది.ఢిల్లీ: రాందేవ్ బాబా కొత్త వీడియో విషయాన్ని హమ్దార్డ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దానికి జస్టిస్ అమిత్ బన్సాల్ తీవ్రంగా స్పందిస్తూ.. రామ్దేవ్ ఎవరి నియంత్రణలో లేరని ఆయన చేష్టలు బట్టి అర్థమవుతోంది. ఆయన తన సొంత ప్రపంచంలో బతుకుతున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ఆయన తన ఆలోచనలను తనలోనే ఉంచుకోవాలని, వాటిని బయటకు వ్యక్తపరచవలసిన అవసరం లేదని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించారనేది స్పష్టం అవుతోందని.. కాబట్టి కోర్టు ధిక్కరణ కింద ఆయనకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. తాజా వీడియోలను సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ఫారంల నుంచి తొలగిస్తామని బాబా రాందేవ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీనికి సంబంధించిన వారంలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని.. ఈ పిటిషన్పై శుక్రవారం మరోసారి వాదనలు వింటామని జస్టిస్ అమిత్ బన్సాల్ తెలిపారు. పతంజలికి చెందిన గులాబ్ షర్బత్ను ప్రచారం చేసే క్రమంలో.. హయ్దార్డ్ రూఅఫ్జాను తక్కువ చేస్తూ బాబా రామ్దేవ్ తీవ్ర చేష్టకు దిగారు. రూఅఫ్జా ద్వారా వచ్చే ఆదాయాన్ని మదర్సాలు, మసీదుల నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తున్నారని రామ్దేవ్ ఆరోపించారు. షర్బత్ జీహాద్ అంటూ రూఅఫ్జాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి టాయిలెట్ క్లీనర్లని, వాటి నుంచి ప్రజలను రక్షించడమే తమ ఉద్దేశమంటూ వ్యాఖ్యానించారు. అలాగే.. అదే ఈ గులాబ్ షర్బత్ (పతంజలి సంస్థకు చెందిన పానీయం) తాగితే.. గురుకులాలను నిర్మించవచ్చు. పతంజలి విశ్వవిద్యాలయాన్ని విస్తరించవచ్చని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై విచారణ చేపట్టాల్సిందిగా హమ్దార్డ్ కోర్టును ఆశ్రయించింది. రామ్దేవ్ వ్యాఖ్యలు సమర్థించలేనివని, దిగ్భ్రాంతికి గురిచేశాయని ఏప్రిల్ 22న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కోర్టు వ్యాఖ్యానించింది. ప్రకటనలు, సోషల్మీడియా పోస్టులతో సహా ఆన్లైన్ కంటెంట్ను వెంటనే తొలగిస్తామని రామ్దేవ్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈహామీని ధృవీకరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయినా కూడా ఆయన మరో వీడియో విడుదల చేయడంతో కోర్టు అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. ఇదిలా ఉంటే.. పతాంజలి ఉత్పత్తుల విషయంలో రామ్దేవ్ బాబా కోర్టు మెట్లెక్కడం ఇదేం కొత్త కాదు. గతంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల (Misleading Ads Case) వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్ సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఇకపై అలాంటి యాడ్స్ ఇవ్వబోమని వారు కోర్టుకు విన్నవించారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది. అయితే, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. -
CJI DY Chandrachud: ఇది కాఫీ షాప్ కాదు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట కాస్తంత మర్యాద తగ్గించి మాట్లాడిన పిటిషనర్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం విచారణ సందర్భంగా ‘ఎస్’ అనడానికి బదులుగా ‘యా’ అని సమాధానమిచ్చిన పిటిషనర్పై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘‘యా. యా. యా’ అని అనకండి. ‘ఎస్’ అని మాట్లాడండి. యా అంటూ పిచ్చాపాటీగా మాట్లాడటానికి ఇది కాఫీ షాప్ కాదు. సుప్రీంకోర్టు. ‘యా’ అని పలికే వ్యక్తులంటే నాకు కొంచెం పడదు. మీ నుంచి ఇలాంటి మాటలను కోర్టు అనుమతించబోదు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్ వెంటనే తన భాషను సరిదిద్దుకున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తనను చట్టవిరుద్ధంగా విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టేయడాన్ని పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ రిట్ పిటిషన్ను సోమవారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గొగోయ్పై విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. గొగోయ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. ‘‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టుకు నేరుగా అప్పీళ్లను అనుమతించే ఆర్టికల్ 32 కింద ఈ అప్పీల్ చేయొచ్చా? ఈ అప్పీల్ను ఆ ఆర్టికల్ కింద పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే ప్రశ్నలను కోర్టు లేవనెత్తింది. న్యాయమూర్తిని ప్రతివాదిగా చేర్చి పిల్ను ఎలా దాఖలు చేశారు?’’ అని సీజేఐ ప్రశ్నించారు. దీంతో పిటిషనర్ స్పందిస్తూ.. ‘‘యా. యా. అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్. క్యూరేటివ్ దాఖలు చేయమని నాకు సూచించారు’’ అంటూ యథాలాపంగా సాధారణ భాషలో మాట్లాడారు. దీంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘జస్టిస్ గొగోయ్ ఈ కోర్టు మాజీ న్యాయమూర్తి. ఒక న్యాయమూర్తిపై ఇలాంటి పిటిషన్ దాఖలు చేసి అంతర్గత విచారణ కోరలేరు. ఎందుకంటే గతంలోనే ఇదే విషయంలో మీరు కేసు ఓడిపోయారు’’ అని సీజేఐ అన్నారు. అప్పుడు పిటిషనర్ స్పందిస్తూ, ‘‘కానీ జస్టిస్ గొగోయ్ నేను సవాలు చేసిన ప్రకటనను బట్టి నా పిటిషన్ను తిరస్కరించారు. నా తప్పేమీ లేదు. కార్మిక చట్టాలపై అవగాహన ఉన్న ధర్మాసనం ముందు నా రివ్యూ పిటిషన్ను పరిశీలించాలని నాటి సీజేఐ ఠాకూర్ను కోరా. కానీ నా అభ్యర్థనను తోసిపుచ్చారు’’ అంటూ కేసు నేపథ్యాన్ని వివరించారు. సీజేఐ, పిటిషనర్ కొద్దిసేపు మరాఠీలో మాట్లాడుకున్నారు. తర్వాత ‘‘జస్టిస్ గొగోయ్ పేరును పిటిషన్ నుంచి తొలగించండి. అప్పుడు ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తుంది’’ అని సీజేఐ సూచించారు. -
సూర్య నోట రాప్ పాట
ఇప్పుడు హీరోలు గాయకులుగా మారడం పరిపాటిగా మారిపోయింది. విజయ్, ధనుష్, శింబు వంటి హీరోలు తమ చిత్రాలకు పాడుకుంటుంటారు. ఇక విశ్వనటుడు కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం ఉండదు. ఇటీవల నటుడు సూర్య, కార్తీలు కూడా పాడటం ప్రారంభించారు. నటుడు సూర్య తాను నటించిన అంజాన్ చిత్రం కోసమే ఒక పాట పాడారు. ఇక దర్శకుడు వెంకట్ప్రభు పార్టీ చిత్రం కోసం సూర్య, కార్తీ ఇద్దరూ కలిసి పాడారు. తాజాగా నటుడు సూర్య రాప్ పాటను పాడటం విశేషం. కాప్పాన్ చిత్రం తరువాత ఈయన నటిస్తున్న చిత్రం సూరరై పోట్రు. ఇరుదుచుట్రు చిత్రం ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అపర్ణ బాలమురళీ నాయకిగా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్బాబు, బాలీవుడ్ స్టార్ జాకీష్రాప్, కరుణాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నటుడు సూర్యనే తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న సూరరై పోట్రు చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాం జరుపుకుంటోంది. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో.. ముఖ్యంగా సూర్య అభిమానుల్లో క్రేజ్ను తెచ్చుకుంది. కాగా త్వరలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ధీమ్ ఉంటుందని, దానికి సంగీతాన్ని జీవీ సమకూర్చుతున్నారనే వార్తలు వెలువడి ఆసక్తిని రేకరెత్తిస్తున్నాయి. కాగా తాజాగా ఆ ధీమ్ మ్యూజిక్కు నటుడు సూర్యతోనే జీవీ.ప్రకాశ్కుమార్ రాప్ పాటను పాడించారు. దీంతో సూరరై పోట్రు చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది. సూర్య అభిమానులు సూరరై పోట్రు చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తరువాత సూర్య వెట్రిమారన్ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం. అదే విధంగా గౌతమ్మీనన్తో చిత్రం చేయడానికి గ్రీస్సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. -
ఆర్బీఐపై మొట్టికాయలేసిన ఈసీ
న్యూఢిల్లీ: నగదు విత్ డ్రా లిమిట్ పెంచాలన్న ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరస్కరించడంపై ఎలక్షన్ కమిషన తీవ్ర అందోళన వ్యక్తం చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వారం నగదు ఉపసంహరణ పరిమితి పెంపుపై ఆర్ బీఐ వైఖరిపై మండిపడిన ఈసీ మళ్లీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు మరో లేఖ రాసింది. నగదు విత్ డ్రా పరిమితులు ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతీసేలా ఉండకూడదని మొట్టికాయలేసింది. ఈ చర్య సరైంది కాదనీ, అంగీకరించలేమని ఈసీ తెలిపింది. కనీసం చట్టబద్ధమైన ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులకు నగదు విత్ డ్రాలపై నిరోధం ఉండకూడదని సూచించింది. నగదు ఉపసంహరణకు అనుమతి నివ్వాలని మరోసారి కోరింది. ప్రస్తుతం వారానికి ఉన్న రూ. 24 వేల పరిమితిని రూ. 2లక్షలకు పెంచాల్సిందేనని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం ఆయా అభ్యర్థులకు రూ. 28 లక్షల దాకా ఖర్చుచేసే హక్కు వుందని స్పష్టం చేసింది. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆర్బీఐ తొందరపడిందని తన లేఖలో పేర్కొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు క్యాష్ విత్ డ్రా లిమిట్ ను పెంచేందుకు అంగీకరించాలని ఈసీ ఆర్బీఐకి లేఖ రాసింది. రాసింది. ఎన్నికల సందర్భంగా నగదు ద్వారా మాత్రమే చెల్లించాల్సిన అనేక బిల్లులు ఉన్నాయని పేర్కొంది. అభ్యర్థులు నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో స్పందించిన ఈసీ ఆర్బీఐని ముందు ఒక లేఖ రాసింది. నిస్పాక్షికమైన ఎన్నికలు జరగాలంటే అభ్యర్ధుల విత్ డ్రా పరిమితిని పెంచాలంటూ ఈ లేఖలో పేర్కొంది ఈసీ. అయితే ఈ అభ్యర్థనను ఆర్ బీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
రాందేవ్కు మరో షాక్
కోలకతా: ప్రముఖ యోగాగురు రాందేవ్ కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలికి భారీ షాక్ తగిలింది. సంస్థ కు చెందిన వంట నూనెల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) మరో కీలక అడుగువేసింది. ఇటీవల తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసిన సంస్థ పతంజలి కి షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కేంద్ర అనుమతుల సంస్థను కోరింది. వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని ఎఫ్ఎస్ఎస్ఎఐ పేర్కొంది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల వ్యాఖ్యానించింది. ఈ మేరకు కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) ఆహార భద్రత, ప్రమాణాల భారతీయ సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఐ), ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్సీ)కి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులను విచారించిన సంస్థ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా ల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ వాదన. ఈ తాజా పరిణామంపై పతంజలిని వివరణ కోరగా....షోకాజ్ నోటీసులు తమకు అందిన తరువాత స్పందిస్తామని సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణ తెలిపారు. పెట్రోలియం ప్రొడక్ట్ అయిన హెగ్సాగెన్ ద్రావకం క్యాన్సర్ కారకమన్న తమవాదనను సమర్ధించుకున్నారు. -
రాందేవ్ బాబాకు ఝలక్
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు రాం దేవ్ బాబా కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి పై ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ) భారీ ఝలక్ ఇచ్చింది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ద ఎడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసింది. తనకు అందిన సుమారు 156 ఫిర్యాదులపై విచారించి ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) ఆహార భద్రత, ప్రమాణాల భారతీయ సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఐ), ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్సీ)కి ఫిర్యాదు చేసింది. ఈ తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లెటర్ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పతంజలి కచ్చి ఘనీ మస్టర్డ్ ఆయిల్, కేశ్ కాంతి న్యాచురల్ హెయిర్ క్లెన్సర్ తదితర ప్రకటలపై సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తప్పుడు ప్రచారం ద్వారా పతంజలి ఆయుర్వేద వినియోగదారుల్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తోందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే పతంజలి ఆయుర్వేద సంస్థ మాత్రం తన ప్రచారాన్ని గట్టిగానే సమర్ధించుకుంది. వాస్తవాలు, పరిశోధనల ఆధారంగానే తమ ప్రచారాన్ని రూపొందించామని, ఎవరినీ తప్పుదారి పట్టించే ఆలోచన లేదంటూ వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామంపై పతంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి. -
యునిలీవర్ పై యువతి 'ర్యాప్' పోరు
కొడైకెనాల్: డేవిడ్- గొలియాత్ల యుధ్ధం అందరికీ తెలిసిందే. భీకరమైన ఆకారం.. లక్షలాది సైన్యమున్న గొలియాత్ను... గొర్రెలు కాసే బాలుడు డేవిడ్.. అదికూడా విసరడంలో తనకు నైపుణ్యమున్న ఒడిశెతో నేలకూల్చుతాడు. 27 ఏళ్ల సోఫియా అష్రాఫ్ది కూడా అలాంటి పోరే. కాకుంటే శత్రువును అంతమొందించకుండా సంస్కరించే వ్యూహం. ఈ యుద్ధంలో ఆమె ఆయుధం.. ర్యాప్. ప్రఖ్యాత వేసవి విడిది కొడైకెనాల్ పట్టణం నడిబొడ్డులో కొలువైన యునిలీవర్ థర్మామీటర్ ఫ్యాక్టరీ నిత్యం వదులుతోన్న వ్యర్థాలతో పర్యావరణం కలుషితమై.. స్థానిక ప్రజలు రోగాలపాలవుతున్నారు. ఫ్యాక్టరీని తరలించాలని అక్కడి మహిళలు గతంలో చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే వారి నిరసనగానీ, దానికి సంబంధించిన వార్తగానీ కేవలం కొడైకెనాల్ టాబ్లాయిడ్లకే పరిమితమైంది. మరెలా? ప్రజల జీవితాలు.. ధర్మామీటర్లో ఉపయోగించే పాదరసంలో మునిగిపోవాల్సిందేనా? ప్రపంచంలోనే అతిపెద్ద ఎమ్మెన్సీల్లో ఒకటైన యునిలివర్కు తన తప్పును ఎత్తిచూపే మార్గమేలేదా? అనే ప్రశ్నలకు సరికొత్త పోరాటరీతిలో సమాధానమిచ్చింది సోఫియా. ' ఫెయిర్నెస్ కోసం ఫెయిర్ అండ్ లవ్లీ.. దంత ఆరోగ్యానికి పెప్సోడెంట్.. ఒంటి సంరక్షణకు లైఫ్ బాయ్.. అంటూ ప్రాడక్ట్ లకు ప్రచారం కల్పించుకునే మీరు (యునిలీవర్).. ఫ్యాక్టరీ వ్యర్థాలను నిలిపేయాలి. కొడైకెనాల్ ను శుభ్రం చేయాలి' అంటూ ర్యాప్ సాంగ్ పాడింది. యునిలీవర్ తక్షణమే ప్రజారోగ్య వ్యతిరేక కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేసింది. సోఫియా రూపొందించిన ర్యాప్ సాంగ్కు ఇంటర్నెట్లో విశేష స్పందన లభిస్తోంది. వరల్డ్ టాప్ ర్యాపర్లలో ఒకరైన నిక్కి మినాజ్ సైతం సోఫియా పాటకు ఫిదా అయిపోయి.. 'వావ్' అంటూ ట్వీట్ చేసింది. జులై 30న యూ ట్యూబ్లో అప్లోడ్ అయిన సోఫియా ర్యాప్ విడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. మీరూ వినండి.. కచ్చితంగా నచ్చుతుంది. చెన్నైకి చెందిన సోఫియా అష్రాప్.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాహిత కార్యక్రమాలకు ప్రచారం నిర్వహిస్తుంటారు. గతంలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల పక్షాన పోరాడారు. ఇప్పుడు కొడైకెనాల్ ధర్మామీటర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ర్యాప్ వీడియోను రూపొందించారు. ఒకటి రెండు తమిళ సినిమాల్లోనూ సోఫియా తన గళాన్ని వినిపించారు. ఏఆర్ రహమాన్, సంతోష్ కుమార్ సంగీత దర్శకత్వంలోనూ పాడారు.