సొంత ప్రపంచంలో బతుకుతున్నారు.. బాబా రాందేవ్‌పై కోర్టు అసహనం | Delhi High Court Raps Baba Ramdev | Sakshi
Sakshi News home page

సొంత ప్రపంచంలో బతుకుతున్నారు.. బాబా రాందేవ్‌పై కోర్టు అసహనం

May 1 2025 5:01 PM | Updated on May 1 2025 5:22 PM

Delhi High Court Raps Baba Ramdev

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev) పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హమ్‌దార్డ్‌ సంస్థకి చెందిన రూ అఫ్జాపై మరో వీడియో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అలా చేయకూడదని ఆదేశించినప్పటికీ.. అవమానకరమైన వ్యాఖ్యలతో రూ అఫ్జాపై రామ్‌దేవ్‌ మరో కొత్త వీడియోను రూపొందించారని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని పేర్కొంది.

ఢిల్లీ: రాందేవ్‌ బాబా కొత్త వీడియో విషయాన్ని హమ్‌దార్డ్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దానికి జస్టిస్‌ అమిత్‌ బన్సాల్‌ తీవ్రంగా స్పందిస్తూ.. రామ్‌దేవ్‌ ఎవరి నియంత్రణలో లేరని ఆయన చేష్టలు బట్టి అర్థమవుతోంది. ఆయన తన సొంత ప్రపంచంలో బతుకుతున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ఆయన తన ఆలోచనలను తనలోనే ఉంచుకోవాలని, వాటిని బయటకు వ్యక్తపరచవలసిన అవసరం లేదని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించారనేది స్పష్టం అవుతోందని.. కాబట్టి కోర్టు ధిక్కరణ కింద ఆయనకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. 

తాజా వీడియోలను సోషల్‌ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారంల నుంచి తొలగిస్తామని బాబా రాందేవ్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీనికి సంబంధించిన వారంలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని.. ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి వాదనలు వింటామని జస్టిస్‌ అమిత్‌ బన్సాల్‌ తెలిపారు. 

పతంజలికి చెందిన గులాబ్‌ షర్బత్‌ను ప్రచారం చేసే క్రమంలో.. హయ్‌దార్డ్‌ రూఅఫ్జాను తక్కువ చేస్తూ బాబా రామ్‌దేవ్‌ తీవ్ర చేష్టకు దిగారు. రూఅఫ్జా ద్వారా వచ్చే ఆదాయాన్ని మదర్సాలు, మసీదుల నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తున్నారని రామ్‌దేవ్‌ ఆరోపించారు. షర్బత్‌ జీహాద్‌ అంటూ రూఅఫ్జాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి టాయిలెట్‌ క్లీనర్‌లని, వాటి నుంచి ప్రజలను రక్షించడమే తమ ఉద్దేశమంటూ వ్యాఖ్యానించారు. అలాగే.. అదే ఈ గులాబ్‌ షర్బత్‌ (పతంజలి సంస్థకు చెందిన పానీయం) తాగితే.. గురుకులాలను నిర్మించవచ్చు. పతంజలి విశ్వవిద్యాలయాన్ని విస్తరించవచ్చని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై  విచారణ చేపట్టాల్సిందిగా హమ్‌దార్డ్‌ కోర్టును ఆశ్రయించింది.  

రామ్‌దేవ్‌ వ్యాఖ్యలు సమర్థించలేనివని, దిగ్భ్రాంతికి గురిచేశాయని ఏప్రిల్‌ 22న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కోర్టు వ్యాఖ్యానించింది.  ప్రకటనలు, సోషల్‌మీడియా పోస్టులతో సహా ఆన్‌లైన్‌ కంటెంట్‌ను వెంటనే తొలగిస్తామని రామ్‌దేవ్‌ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈహామీని ధృవీకరిస్తూ అఫిడవిట్‌ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయినా కూడా ఆయన మరో వీడియో విడుదల చేయడంతో కోర్టు అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. 

ఇదిలా ఉంటే.. పతాంజలి ఉత్పత్తుల విషయంలో రామ్‌దేవ్‌ బాబా కోర్టు మెట్లెక్కడం ఇదేం కొత్త కాదు. గతంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల (Misleading Ads Case) వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్‌ సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఇకపై అలాంటి యాడ్స్‌ ఇవ్వబోమని వారు కోర్టుకు విన్నవించారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది. అయితే, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement