న్యూఢిల్లీ: నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వ్యక్తమవుతున్న ఆందోళనలను విస్మరించలేమని స్పష్టం చేసిన కోర్టు.. ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన విషయం ఆయన ప్రాణాలను కాపాడటమేనని పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం వాంగ్చుక్ను సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి మెదాంత ఆసుపత్రికి తరలించే ప్రతిపాదనను పరిశీలించింది.
విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షా విధానంలో మార్పులు కోరుతూ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేపట్టిన వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే తన అనుమతి లేకుండా ఆసుపత్రికి తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపై నమ్మకం లేదని ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను కుటుంబం కోరుకున్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. విచారణ సందర్భంగా కోర్టు.. వాంగ్చుక్ ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆందోళనలు, మెరుగైన వైద్య సదుపాయాల అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై విచారణ సందర్భంగా హైకోర్టు.. “ఆయన ప్రాణాలను కాపాడటమే ప్రస్తుతం తొలి ప్రాధాన్యత” అని పేర్కొంది. నిరాహార దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని తెలిపింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించిన కోర్టు.. అందుతున్న చికిత్స వివరాలను కూడా కోరింది.
వాంగ్చుక్ తన తరలింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో తనను కలిసేందుకు పరిమితులు విధించారని, తన పరికరాలను తీసుకున్నారని, కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించారు.
కాగా.. విద్యార్థుల సమస్యలు, పరీక్షా వ్యవస్థలో లోపాలు, విద్యా రంగ సంస్కరణల డిమాండ్లతో వాంగ్చుక్ జంతర్ మంతర్లో 20 రోజులకు పైగా నిరాహార దీక్ష కొనసాగించారు. దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అయింది. దీంతో పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.
వాంగ్చుక్ ఆసుపత్రికి తరలింపు అంశం నేపథ్యంలో కాక్రోచ్ జంతా పార్టీ (CJP) ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ప్రభుత్వం వ్యవహరించిన తీరును పార్టీ నేతలు ప్రశ్నిస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం వైద్యుల సూచనలు, భద్రతా కారణాల దృష్ట్యానే ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం వాంగ్చుక్ను మెదాంత ఆసుపత్రికి తరలించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రం తరఫున న్యాయవాది కూడా మెదాంతకు తరలింపుపై అభ్యంతరం లేదని తెలిపినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా తరలింపు సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు జోక్యంతో వాంగ్చుక్ ఆరోగ్య వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఒకవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి.. మరోవైపు ఆయన డిమాండ్లపై కొనసాగుతున్న ఆందోళనలు ఢిల్లీ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.


