తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు | Indias First Vande Bharat Metro Launch on September 16 Schedule, Stoppages, Speed and Features | Sakshi
Sakshi News home page

తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు

Sep 13 2024 4:41 PM | Updated on Sep 13 2024 6:43 PM

Indias First Vande Bharat Metro Launch on September 16 Schedule, Stoppages, Speed and Features

భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైళ్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రూట్లలో ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్‌-తిరుపతి-సికింద్రాబాద్‌, కాచిగూడ-యశ్వంత్‌పూర్‌-కాచిగూడ, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు సైతం  రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

తాజాగా వందే భారత్ రైళ్లకు తోడు వందే భారత్ మెట్రో రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16వ తేదీన తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలు ఎక్కనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రయాణించనున్న  తొలి వందే భారత్ మెట్రో రైలును..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రారంభించనున్నారు.

ఈ రైలు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఉండగా.. వాటి కంటే సుదూర ప్రయాణాలకు ఉపయోగించనున్నారు. అహ్మదాబాద్-భుజ్ మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణించనుంది.  భుజ్ రైల్వే స్టేషన్‌లో తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రారంభమై.. ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకోనుంది. 

తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్‌లో ప్రారంభమై.. రాత్రి 11.10 గంటలకు భుజ్ చేరుకోనుంది. వారంలో 6 రోజులు ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణం చేయనుంది. ఇక భుజ్-అహ్మదాబాద్ మార్గంలో ఈ రైలుకు 9 స్టాప్‌లు ఉండగా.. ప్రతీ స్టేషన్‌లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుందని  భారతీయ రైల్వే తెలిపింది.

వందే భారత్ మెట్రో అనేది సెమీ-హై-స్పీడ్ రైలు. ఇది గంటకు 100 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వందే భారత్ రైలు లాగానే ఈ రైలు కూడా పూర్తిగా ఎయిర్ కండీషన్ కలిగి ఉంటుంది. మొదట 12 కోచ్‌లతో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ మెట్రో రైలుకు.. ప్రయాణికుల రద్దీ దృష్టా వాటిని 16 కోచ్‌లకు పెంచనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. 

ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉండనుండగా.. నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ఇందులో మన మెట్రో రైలు లాగా ఆటోమేటిక్ డోర్లు ఉండటం మరో ప్రత్యేకత. ఈ వందే భారత్ మెట్రో రైలును గంటకు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు.

ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్‌తో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి కోచ్‌లో మంటలు, పొగ వంటి ప్రమాదాన్ని వెంటనే గుర్తించేలా మొత్తం 14 సెన్సార్లతో కూడిన సెన్సార్ సిస్టమ్ ఉంటుంది.  దివ్యాంగుల కోసం కోచ్‌లలో వీల్‌చైర్ యాక్సెస్ కలిగిన టాయిలెట్లు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement