ట్రంప్‌ దూకుడు.. మరో 119 మంది భారతీయులు వెనక్కి.. | Indian migrants deported from US to arrive Amritsar | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ దూకుడు.. మరో 119 మంది భారతీయులు వెనక్కి..

Feb 15 2025 8:03 AM | Updated on Feb 15 2025 10:46 AM

Indian migrants deported from US to arrive Amritsar

చండీగఢ్‌: అగ్ర రాజ్యం అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే భారత్‌కు చెందిన మరో 119 మంది అక్రమ వలసదారులు రెండు విమానాల్లో స్వదేశం చేరుకోనున్నారు. తొలి విమానం శనివారం రాత్రి 10 గంటలకు అమృత్‌సర్‌ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను తిరిగి పంపించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను స్వదేశానికి పంపనుంది. తొలి విమానం సీ 17 గ్లోబ్‌ మాస్టర్‌-3.. 119 మందితో శనివారం రాత్రి 10 గంటలకు అమృత్‌సర్‌లో దిగనుంది. రెండో విమానం ఆదివారం ల్యాండ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విమానంలో ఎంత మందిని పంపించనున్నారన్న విషయం వెల్లడి కాలేదు. ఇక, తొలి విమానంలో రానున్న 119 మంది భారత వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందినవారు. మిగతా వారు హర్యానా (33), గుజరాత్‌ (8), ఉత్తర్‌ప్రదేశ్‌ (3), గోవా (2), మహారాష్ట్ర (2), రాజస్థాన్‌ (2), హిమాచల్‌ ప్రదేశ్‌(1), జమ్ము కశ్మీర్‌ (1)వాసులుగా గుర్తించారు.

ఇక, గతవారం.. సైనిక విమానంలో అమెరికా 104 మంది అక్రమ వలసదారులను పంపిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వస్తున్న విమానాలు అమృత్‌సర్‌ విమానాశ్రయంలోనే దిగుతున్న నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సీఎం మాన్‌ మాట్లాడుతూ..‘119 మంది అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందిన వారని.. అందుకే అమృత్‌సర్‌లో విమానం ల్యాండ్‌ చేస్తున్నామని వాళ్లు చెబుతున్నారు. అలా అయితే.. మొదట వచ్చిన విమానం అహ్మదాబాద్‌లో ఎందుకు దిగలేదు?. ఇప్పుడు రెండో విమానం వస్తోంది. ఇది కూడా అమృత్‌సర్‌ విమానాశ్రయంలోనే దిగనుంది. అమృత్‌సర్‌నే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఎందుకు దించడం లేదు. కేవలం పంజాబ్‌ ప్రతిష్ఠను దిగజార్చాలని కేంద్రం ప్రయత్నిస్తోంది’ అంటూ ఆరోపణలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement