ఘనంగా రెండో అడుగు  | Indian astronaut Shubhanshu Shukla Axiom-4 Mission Launch | Sakshi
Sakshi News home page

ఘనంగా రెండో అడుగు 

Jun 26 2025 4:49 AM | Updated on Jun 26 2025 6:52 AM

Indian astronaut Shubhanshu Shukla Axiom-4 Mission Launch

రోదసిలోకి శుభాన్షు శుక్లా 

రెండో భారతీయునిగా రికార్డు

న్యూఢిల్లీ: భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌. పదేపదే వాయిదాల అనంతరం, దేశమంతా ఊపిరి బిగబట్టి మరీ ఎదురుచూస్తున్న చరిత్రాత్మక క్షణాలు ఎట్టకేలకు రానే వచ్చాయి. యాగ్జియం–4 మిషన్‌ వాణిజ్య మిషన్‌ను వెంట తీసుకుని స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌–9 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. 

కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్‌ రాకెట్‌ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్‌ పైలట్‌గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్‌ కెపె్టన్‌ శుభాన్షు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్‌ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. 

మర్చిపోలేని ఆ క్షణాలను రోదసి నుంచే దేశవాసులందరితో పంచుకుని మురిసిపోయారు. ‘ప్రియమైన నా దేశవాసులారా! నమస్తే’ అంటూ భుజాన త్రివర్ణ పతాకం ధరించి భావోద్వేగానికి లోనయ్యారు. అంతరిక్ష ప్రవేశ యాత్ర అద్భుతంగా సాగిందంటూ సంభ్రమాశ్చర్యాల నడుమ పేర్కొన్నారు. జైహింద్, జై భారత్‌ అంటూ రోదసి సాక్షిగా నినదించారు. శుభాన్షు స్వస్థలం లఖ్‌నవూ నుంచి ప్రయోగాన్ని ఆద్యంతం వీక్షించిన ఆయన తల్లిదండ్రులు ఆనందాశ్రువులు రాల్చారు. 

తమ కుమారుడు చరిత్ర సృష్టించాడంటూ పరవశించిపోయారు. కేంద్ర మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమై శుభాన్షు ఘనతను ప్రస్తుతించింది. దేశపతాకను ఆయన అత్యున్నత స్థాయిలో రెపరెపలాడించారంటూ ప్రశంసించింది. రాజకీయ తదితర రంగాల ప్రముఖులు తదితరుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 

అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్‌ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)తో అనుసంధానం అవనుంది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్‌ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్‌ పెగ్గీ విట్సన్, మిషన్‌ స్పెషలిస్టులు స్లవోస్‌ ఉజ్నాన్‌స్కీ విస్నియెవ్‌స్కీ (పోలండ్‌), టైబర్‌ కపు (హంగరీ)తో కలిసి శుభాన్షు ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశిస్తారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. యాగ్జియం–4 ఇస్రో, నాసా సంయుక్త మద్దతుతో రూపొందిన వాణిజ్య అంతరిక్ష యాత్ర.

మిషన్‌ గ్రేస్‌ మిస్టర్‌ శుక్స్‌ 
ఐఎస్‌ఎస్‌లో ఉన్నంతకాలం శుభాన్షును శుక్స్‌ అనే సంకేత నామంతో పిలవనున్నారు. అలాగే తమ యాగ్జియం–4 వ్యోమనౌకకు కూడా వ్యోమగాములు నలుగురూ గ్రేస్‌ అని పేరు పెట్టుకున్నారు. విజయవంతంగా అంతరిక్షంలో చేరిన అనంతరం వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘ఓపికతో వేచి చూసేవారికి అంతా మంచే జరుగుతుంది. గ్రేస్‌ సిబ్బంది తొలి యాత్రను దేవుడు అన్నివిధాలా వెంట ఉండి నడిపించు గాక’’ అంటూ యాగ్జియం–4 బృందానికి స్పేస్‌ ఎక్స్‌ శుభాకాంక్షలు తెలిపింది.

వందేమాతరం నుంచి... 
‘యూ హి చలా చల్‌’ దాకా 
అంతరిక్ష యాత్రకు బయల్దేరే ముందు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి వ్యోమగాములు తమకు నచి్చన సంగీతాన్ని, పాటలను ఆస్వాదించడం ఆనవాయితీ. అలా యాగ్జియం–4 యాత్రకు బయల్దేరే ముందు శుభాన్షు హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన ‘ఫైటర్‌’ సినిమాలోని తనకెంతో ఇష్టమైన వందేమాతరం పాటను విన్నారు. ఐఎస్‌ఎస్‌లో ఆస్వాదించేందుకు వీలుగా పలు పాటలతో కూడిన ప్లే లిస్ట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. అందులో షారుక్‌ ఖాన్‌ నటించిన ‘స్వదేశ్‌’ సినిమాలోని సూపర్‌హిట్‌ రోడ్డు పాట ‘యూ హి చలా చల్‌ రాహీ, కిత్నీ హసీఁ హై ఏ దునియా (అలా సాగిపో యాత్రికా, ఈ ప్రపంచమెంత అందమైనదో!) తదితర పాటలు అందులో ఉన్నాయి. ప్రయోగానికి ముందు శుభాన్షు ఎక్స్‌ పోస్టులో ఈ మేరకు వెల్లడించారు. యాదృచి్చకంగా స్వదేశ్‌ సినిమాలో షారుక్‌ కూడా నాసా సైంటిస్టు కావడం విశేషం.

చిన్ననాటి కల  సాకారం! 
గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టబోతున్న ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. రాకేశ్‌ శర్మ అంతరిక్షంలో కాలుమోపిన ఏడాదికి, అంటే 1985లో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో శుభాన్షు జని్మంచారు. బాల్యంలో ఒక ఎయిర్‌ షో చూసినప్పటి నుంచే ఆకాశంపై మనసు పారేసుకున్నారు.

 విమానాలు, వాటి వేగం, వాటి శబ్దాలు తన బుల్లి మనసులో శాశ్వతంగా తిష్ట వేసుకుపోయాయి. పైలట్‌ కావాలని అప్పుడే తీర్మానించుకున్నారాయన. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీలో చేరి తన కల నిజం చేసుకున్నారు. 2006లో భారత వాయుసేనలో చేరారు. పదేళ్ల పై చిలుకు కెరీర్‌లో 2 వేల గంటల పైచిలుకు ఫ్లయింగ్‌ అవర్స్‌ అనుభవం ఆయన సొంతం. సుఖోయ్‌–30 ఎంకేఐ, మిగ్‌–29తో పాటు జాగ్వార్, డోర్నియర్‌–228 వంటి పలు యుద్ధ విమానాలు నడిపారు.

 ప్రస్తుతం గ్రూప్‌ కెప్టెన్‌గా చేస్తున్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నుంచి ఏరోస్పేస్‌లో ఎంటెక్‌ చేశారు. 2027లో ఉద్దేశించిన గగన్‌యాన్‌ మిషన్‌ కోసం 2019లో కేంద్రం ఎంపిక చేసిన నలుగురు ఆస్ట్రొనాట్ల బృందంలో శుభాన్షు ఒకరు. అంతరిక్ష యాత్ర నిమిత్తం తొలుత బెంగళూరులో, తర్వాత రష్యాలో గగారిన్‌ కాస్మోనాట్‌ శిక్షణ కేంద్రంలో కఠోరమైన శిక్షణ పొందారు. యాగ్జియం–4 మిషన్‌కు పైలట్‌గా కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏకాగ్రత, సునిశిత బుద్ధి తిరుగులేనివని సహచర వ్యోమగాములు కూడా కితాబిచ్చారు.  

...అలా ఎన్‌డీఏలోకి 
శుభాన్షు పేరు ఇప్పుడిలా దేశమంతా మారుమోగుతోందంటే ఆయన ఎన్‌డీఏలో చేరి వాయుసేన పైలట్‌ కావడమే ప్రధాన కారణం. అయితే ఎన్‌డీఏలో శుభాన్షు ప్రవేశం అనుకోకుండా జరిగిందని ఆయన తండ్రి గుర్తు చేసుకున్నారు. ‘‘శుభాన్షు స్కూల్‌మేట్స్‌ ఎన్‌డీఏ పరీక్ష రాసేందుకు దరఖాస్తు ఫారాలు తీసుకొచ్చారు. కానీ వారిలో ఒకరికి వయోపరిమితి దాటిపోయింది. దాంతో శుభాన్షును రాస్తావా అని అడిగాడు. మావాడు వెంటనే సరేనన్నాడు. అలా పరీక్ష రాసి ఎన్‌డీఏకు సెలక్టయ్యాడు’’ అంటూ వివరించారు. తమకైతే శుభాన్షు సివిల్స్‌ రాసి కలెక్టర్‌ కావాలని ఉండేదని వెల్లడించారు.  

తల్లిదండ్రుల ఆనంద నృత్యం 
శుభాన్షు అంతరిక్షయాత్రను వీక్షించి ఆయన తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. యాగ్జియం–4 ప్రయోగాన్ని లఖ్‌నవూలో శుభాన్షు విద్యాభ్యాసం చేసిన సిటీ మాంటెసొరీ స్కూల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా వారు వీక్షించారు. యాత్ర విజయవంతం కాగానే తోటివారందరితో కలిసి భాంగ్రా నృత్యం చేస్తూ ఆనందం పంచుకున్నారు. ప్రాంగణమంతా చప్పట్లతో, ‘హిప్‌ హిప్‌ హుర్రే’, ‘భారత్‌మాతా కీ జై’ నినాదాలతో మార్మోగిపోయింది. 

తమకివి మరపురాని క్షణాలని శుభాన్షు తండ్రి శంభూ శుక్లా అన్నారు. ‘‘ఇవి ఆనందాశ్రువులు. ఇంతకన్నా మాట్లాడేందుకు నాకు మాటలే రావడం లేదు’’ అని తల్లి ఆశా చెప్పారు. తన కొడుకు ఇలాంటి ఘనత సాధిస్తాడని ముందే తెలుసన్నారు. యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రయోగానికి ముందు కుమారునికి ఆమె వర్చువల్‌గా చక్కెర కలిపిన పెరుగు తినిపించి నోరు తీపి చేశారు. తమ విద్యార్థి భారత కీర్తిని అంతరిక్షం దాకా చేర్చాడంటూ స్కూలు టీచర్లు తదితరులు కూడా హర్షం వెలిబుచ్చారు.

నాడు ‘సారే జహా సే అచ్చా’ 
స్క్వాడ్రన్‌ లీడర్‌ రాకేశ్‌ శర్మ తర్వాత రోదసిలోకి ప్రవేశించిన రెండో భారతీయునిగా శుభాన్షు శుక్లా నిలిచారు. సోవియట్‌ యూనియన్‌ సల్యూట్‌–7 స్పేస్‌ మిషన్‌లో భాగంగా రాకేశ్‌ శర్మ 1984లో 8 రోజుల పాటు అంతరిక్ష యాత్ర చేయడం తెలిసిందే. అక్కడినుంచి భూమి ఎలా కన్పిస్తోందన్న అప్పటి ప్రధాని ఇందిర ప్రశ్నకు బదులుగా ‘సారే జహా సే అచ్చా’ అంటూ రాకేశ్‌ శర్మ ఇచ్చిన భావోద్వేగపూరిత సమాధానంతో జాతి యావత్తూ ఉప్పొంగిపోయింది.

ప్రయోగానికి ముందూ సమస్యలే 
యాగ్జియం–4 ప్రయోగ వేళ సమీపించగానే సహచర వ్యోమగాములతో కలిసి శుభాన్షు నెల రోజుల క్వారెంటైన్‌ నుంచి బయటికొచ్చారు. ఒక్కొక్కరుగా వ్యోమనౌకలోకి ప్రవేశించారు. రాకెట్‌ తాలూకు ఒక తీగ వేలాడుతుండటంతో పాటు పలు సమస్యలను గమనించి అప్పటికప్పుడు సరిచేశారు. మే 29న జరగాల్సిన ఈ ప్రయోగం రాకెట్‌ సమస్యలతో పదేపదే వాయిదా పడుతూ వచ్చింది.

14 రోజులు, 60 ప్రయోగాలు 
శుభాన్షు తన ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో 14 రోజుల పాటు గడుపుతారు. ఈ సందర్భంగా భారరహిత స్థితిలో వారు దాదాపు 60 ప్రయోగాలు నిర్వహిస్తారు. వాటిలో ఆహారం, పౌష్టికత సంబంధిత ప్రయోగాలు కూడా ఉన్నాయి. వాటిని నాసో మద్దతుతో ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ రూపొందించాయి. శుభాన్షు కోసం ఇస్రో ఏడు ప్రయోగాలను సిద్ధం చేసి ఉంచింది. సూక్షభార స్థితిలో మెంతులు, పెసలు ఎలా మొలకెత్తుతాయో ఆయన పరీక్షించి చూడనున్నారు.  

ప్రధానితో, పిల్లలతో మాటామంతి 
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి ప్రధాని మోదీతో శుభాన్షు మాటామంతి జరపనున్నారు. అలాగే పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులతో పాటు అంతరిక్ష రంగ నిపుణులు, సంస్థల సీఈఓలు, దిగ్గజాలతో కూడా ఆయన తన అనుభవాలను పంచుకుంటారు.

క్యారెట్‌ హల్వా, మామిడి రసం 
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) భారతీయ వంటకాల ఘుమఘుమలాడనుంది. భారత పాక ప్రావీణ్యానికి అద్దం పట్టే కూరలు, అన్నం, మామిడి రసం వంటివాటిని శుభాన్షు ఐఎస్‌ఎస్‌కు వెంట తీసుకెళ్లారు. ‘‘తనకు క్యారెట్, పెసరపప్పు హల్వా అంటే చాలా ఇష్టం. వాటితోపాటు మరెన్నో మా ఇంటి రుచులను వెంట తీసుకెళ్లాడు. తోటి వ్యోమగాములకు కూడా రుచి చూపిస్తానని చెప్పాడు’’ అని శుభాన్షు సోదరి శుచి తెలిపా రు. ఇతర వ్యోమగాములు పప్రికా పేస్ట్‌ (హంగరీ), ఫ్రీజ్‌–ఫ్రైడ్‌ పైరోజీస్‌ (పోలండ్‌) వంటి వంటకాలను తమతో పాటు తీసుకెళ్లారు.

నింగిని నెగ్గి, తారలు తాకి 
శుభాన్షుకు వాయుసేన అభినందనలు 
యాగ్జియం–4 మిషన్‌ను భారత్‌కు ఓ అది్వతీయానుభూతిగా వాయుసేన అభివరి్ణంచింది. ‘‘వాయుసేన యోధుడు గ్రూప్‌ కెపె్టన్‌ శుభాన్షు శుక్లా చరిత్రాత్మక అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టారు. నింగిని నెగ్గుతూ తారల్ని తాకుతూ దేశ గౌరవాన్ని, ప్రతిష్టను తనతోపాటు సగర్వంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లారు’’ అంటూ అభినందించింది. ఆయన ప్రొఫైల్‌ ఫొటోను షేర్‌ చేసింది. ‘నీలిదుస్తుల్లో (వాయుసేన యూనిఫాంను ఉద్దేశించి) శిక్షణ, చుక్కలకేసి పయనం’ అంటూ అందమైన క్యాప్షన్‌ జోడించింది. ‘ఈ అద్భుత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం’ జాతీయ పతాకంలోని మూడు రంగులతో కూడిన అక్షరాలతో మరో సందేశాన్ని పోస్టు చేసింది.  
 
కేంద్ర మంత్రివర్గం అభినందనలు 
దేశ ఆకాంక్షలను మోసుకెళ్లారు: మోదీ 
యాగ్జియం–4 మిషన్‌ విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆశలు, ఆకాంక్షలను శుభాన్షు తనతో పాటు అంతరిక్షంలోకి మోసుకెళ్లారన్నారు. ‘‘ఐఎస్‌ఎస్‌లో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా నిలవనున్న గ్రూప్‌ కెప్టెన్‌ శుక్లాకు, ఇతర వ్యోమగాములకు శుభాభినందనలు’’ అంటూ ప్రధాని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆయన సారథ్యంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై శుభాన్షుకు అభినందనలు తెలిపింది. యాగ్జియం–4 యాత్ర దిగి్వజయం కావాలని ఆకాంక్షించింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చదివి విని్పంచారు.

సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారు: ఖర్గే
శుభాన్షు సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఆయన యాత్ర సఫలమవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement