ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం
న్యూఢిల్లీ: బెంగళూరులోని అంతరిక్ష స్టార్టప్ సంస్థ గెలాక్సీఐకి చెందిన ‘మిషన్ దృష్టి’ఉపగ్రహాన్ని ఆదివారం అమెరికాలోని కాలిఫోరి్నయాలో స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. మిషన్ దృష్టి అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం. ఇది ఎలక్ట్రో–ఆప్టికల్ (ఈఓ), సింథటిక్ అపర్చర్ రాడార్(ఎస్ఏఆర్) సెన్సార్లను ఒకే కార్యాచరణ ప్లాట్ఫారమ్లోకి అనుసంధానిస్తుంది.
ఈఓ సెన్సార్లు సూర్యకాంతిలో లేదా నిర్మలమైన ఆకాశం ఉన్నప్పుడు అధిక రిజల్యూషన్తో చిత్రాలను బంధిస్తాయి. ఎస్ఏఆర్ సెన్సార్లు రాడార్ పల్స్లను ఉపయోగించి అన్ని కాలాల్లో, అన్నిరకాల వాతావరణ పరిస్థితులలో స్పష్టమైన చిత్రాలను అందిస్తాయి. మిషన్ దృష్టి ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరుకున్నట్లు గెలాక్సీఐ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుయాష్ సింగ్ తెలిపారు.
ఈ ఉపగ్రహం సంప్రదాయ వ్యవస్థల్లోని దీర్ఘకాలిక పరిమితులను అధిగమించడంతోపాటు విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో మరింత విశ్వసనీయమైన, స్థిరమైన డేటాను సేకరిస్తుంది. ఇది ద్వంద్వ ప్రయోజన భూ పరిశీలన ఉపగ్రహం. రక్షణ, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక సదుపాయాల ప్రణాళిక వంటి రంగాల్లో తోడ్పాటు అందిస్తుంది. ఐదేళ్ల స్వదేశీ పరిశోధన, అభివృద్ధి, విస్తృతమైన పర్యావరణ పరీక్షలు, ‘మిషన్ దృష్టి’పనితీరు ధ్రువీకరణ తర్వాత ఈ ప్రయోగం జరిగింది. మిషన్ దృష్టి ప్రయోగం భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభివరి్ణంచారు.


