భారత్‌లో వివాదం.. మరి ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి? | India Passport Row: How Other Countries Differ | Sakshi
Sakshi News home page

భారత్‌లో వివాదం.. మరి ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి?

Jun 25 2026 1:48 PM | Updated on Jun 25 2026 1:59 PM

India Passport Row: How Other Countries Differ

పాస్‌పోర్ట్‌ పౌరసత్వానికి రుజువు కాదంటూ కేంద్రం చేసిన తాజా వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పాస్‌పోర్ట్‌ కోసం పోలీసు వెరిఫికేషన్‌ నుంచి పలు స్థాయిల పరిశీలన జరిగితే.. అదే పత్రాన్ని పౌరసత్వానికి ఆధారంగా ఎందుకు గుర్తించరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వివాదం మధ్య మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? పాస్‌పోర్ట్‌ను అక్కడ పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తారా? లేదంటే భారత్‌లాగే అభ్యంతరాలు ఉన్నాయా? పరిశీలిస్తే.. 

పాస్‌పోర్ట్‌ అనగానే చాలా మందికి అది ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిరూపించే అత్యంత బలమైన పత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏ దేశమైనా తన పౌరులకే పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తుంది. అయితే చట్టపరంగా అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండదు. పాస్‌పోర్ట్‌కు ఇచ్చే చట్టబద్ధ హోదా దేశానికో విధంగా ఉంటుంది.

అమెరికాలో.. 
ప్రపంచంలో పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి అత్యంత బలమైన ఆధారంగా గుర్తించే దేశాల్లో అమెరికా ముందుంటుంది. అక్కడ చెల్లుబాటు అయ్యే అమెరికన్‌ పాస్‌పోర్ట్‌ ఉంటే.. అది పౌరసత్వ ధ్రువీకరణ పత్రంతో సమానంగా పరిగణిస్తారు. ప్రభుత్వ సంస్థలు, కోర్టులు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కూడా సాధారణంగా అమెరికన్‌ పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి ప్రత్యక్ష ఆధారంగా అంగీకరిస్తారు. అమెరికాలో జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate), Certificate of Citizenship, US Passport.. ఈ మూడు ప్రధాన పౌరసత్వ ఆధారాలుగా పరిగణిస్తారు. వీటిలో పాస్‌పోర్ట్‌కే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.

బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ..
అమెరికా తరహాలోనే బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి కామన్‌ లా దేశాల్లో కూడా పాస్‌పోర్ట్‌కు భారీ చట్టబద్ధ ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉంటే.. సాధారణ పరిస్థితుల్లో అతడు ఆ దేశ పౌరుడేనని అధికారులు భావిస్తారు. అయితే అవసరమైతే పౌరసత్వ రికార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు, నేచురలైజేషన్‌ సర్టిఫికెట్లు వంటి అదనపు ఆధారాలను పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది.

యూరప్‌లో పరిస్థితి ఎలా ఉందంటే.. 
జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ వంటి యూరోపియన్‌ దేశాల్లో పాస్‌పోర్ట్‌ బలమైన పౌరసత్వ ఆధారంగా పరిగణించబడుతుంది. అయితే అక్కడ చాలా దేశాల్లో జాతీయ గుర్తింపు కార్డులు (National ID Cards) కూడా ఉంటాయి. అందువల్ల పౌరసత్వ నిర్ధారణలో పాస్‌పోర్ట్‌తో పాటు జాతీయ గుర్తింపు వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. యూరోపియన్‌ యూనియన్‌లోని అనేక దేశాల్లో పౌరులు దేశీయ ప్రయాణాలు, ప్రభుత్వ సేవల కోసం పాస్‌పోర్ట్‌ కంటే జాతీయ గుర్తింపు కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తారు.

మరి భారత్‌లాంటి దేశాలు ఉన్నాయా?
అవును.. భారత్‌ మాత్రమే కాదు కొన్ని దేశాల్లో పాస్‌పోర్ట్‌ ఉన్నంత మాత్రాన అది పౌరసత్వానికి శాశ్వత, అంతిమ రుజువు కాదని భావిస్తారు. ఉదాహరణకు కెనడాలో పాస్‌పోర్ట్‌కు అధిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. సిటిజన్‌షిప్‌ సర్టిఫికెట్‌(Citizenship Certificate) అనే ప్రత్యేక పత్రాన్ని పౌరసత్వానికి మరింత బలమైన ఆధారంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో పాస్‌పోర్ట్‌తో పాటు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి రావొచ్చు.

అలాగే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జాతీయ పౌరసత్వ రిజిస్టర్లు, ప్రత్యేక సిటిజన్‌ కార్డులు, ప్రభుత్వ రికార్డులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది.

అసలు ఎన్ని దేశాలు పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తున్నాయి?. ఇదే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ఒకే విధమైన అధికారిక జాబితా లేదు. అయితే సాధారణంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ భాగం పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి బలమైన, ప్రాథమిక ఆధారంగా అంగీకరిస్తాయి. మరోవైపు కొన్ని దేశాలు మాత్రం అదనపు పౌరసత్వ ధ్రువీకరణ వ్యవస్థలను కూడా కొనసాగిస్తున్నాయి. అంటే ప్రపంచంలోని 190కి పైగా దేశాల్లో పాస్‌పోర్ట్‌కు ఉన్న చట్టబద్ధ హోదా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది.

భారత్‌లో వివాదం ఎందుకంటే.. 
భారత్‌లో ప్రస్తుతం ప్రతి పౌరుడికి ఇచ్చే ఒకే ఒక్క "యూనివర్సల్‌ సిటిజన్‌షిప్‌ డాక్యుమెంట్‌" లేదు. ఆధార్‌ గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుంది. ఓటరు కార్డు ఓటు హక్కును సూచిస్తుంది. పాన్‌ కార్డు పన్ను అవసరాల కోసం. పాస్‌పోర్ట్‌ ప్రయాణ పత్రం మాత్రమే. దీంతో పౌరసత్వాన్ని నిరూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క పత్రం కాకుండా.. జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల రికార్డులు, విద్యా ధ్రువపత్రాలు, ప్రభుత్వ రికార్డులు వంటి అనేక ఆధారాలను అధికారులు పరిశీలించాల్సి వస్తోంది.

చర్చ ఎటు దారితీస్తోంది?
పాస్‌పోర్ట్‌ పౌరసత్వానికి రుజువా? కాదా? అనే ప్రశ్న కంటే.. భారత్‌లో ప్రత్యేక పౌరసత్వ గుర్తింపు వ్యవస్థ అవసరమా? అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో పాస్‌పోర్ట్‌ ఒక్కటే సరిపోతుండగా.. భారత్‌లో మాత్రం పౌరసత్వ నిర్ధారణకు బహుళ పత్రాల అవసరం కొనసాగుతోంది. అందుకే కేంద్రం చేసిన తాజా వ్యాఖ్యతో మొదలైన ఈ చర్చ.. ఇప్పుడు భారత పౌరసత్వ వ్యవస్థ భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement