
ఢిల్లీ: పాకిస్తాన్ను మరింత ఇబ్బంది పెట్టేలా భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ గగనం తలంలో పాక్ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో పాకిస్థాన్ నుంచి భారత్ మీద నుంచి కాకుండా ఇతర దేశాల గగనం తలం నుంచి గమ్య స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, భారత విమానాలకు పాకిస్తాన్ గగనతల మూసివేయడంతో ప్రతి చర్యగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఆంక్షలు మే 24 వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ గడువు మున్ముందు పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది. భారత గగన తలంపై పాక్ విమానాల నిషేధం విధిస్తూ.. కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ‘భారత్ గగనం తలంపై పాక్ విమానాలు నిషేదం. వాటిల్లో పాక్ రిజిస్టర్డ్ విమానాలు, అలాగే పాక్ ఎయిర్లైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, లేదంటే లీజుకు తీసుకున్న విమానాలకు భారత గగనతల ప్రవేశం లేదు. ఇందులో సైనిక విమానాలూ ఉన్నాయి’ అని కేంద్రం విడుదల చేసిన నోట్లో పేర్కొంది.
మరోవైపు భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పాక్కు చెందిన విమానాలు భారత్ గగనతలం మీద నుంచి ప్రయాణించకూడదన్న ఆదేశాలు అమల్లో ఉండగా.. ఇప్పుడు అధికారికంగా గగనతలాన్ని మూసివేస్తూ భారత్ ప్రకటన చేయడంపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ చర్య వల్ల దక్షిణ ఆసియా, ఓషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాలు భారత గగన తలం మీద నుంచి పొరుగు దేశాల మీద నుంచి తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. ఆ ఫలితం పాక్ విమానయాన రంగంపై పడనుంది. విమానం ప్రయాణ సమయం పెరగడం, ఫ్లైట్ ఛార్జీలు పెరగడం, విమాన ఇంధన ధరలు పెరగడం, విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గడం వంటి ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసీ పాక్ మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయిన పాకిస్తాన్ విమానయాన సంస్థలకు తాజా భారత నిర్ణయంతో అదనపు భారం పడనుంది.