కర్ణాటక: కలహాలు కుటుంబాల ఊపిరి తీస్తున్నాయి. చిన్న చిన్న గొడవలకే హత్య, ఆత్మహత్య చేసుకుని పసిపిల్లలను అనాథలు చేయడం అధికమైంది. ఇదే మాదిరిగా భార్యకు అక్రమ సంబంధం ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పి, ఆమెను చంపి, తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా కెసగోడు గ్రామంలో జరిగింది. రఘు (41), భార్య గగన(38) మృతులు. వీరికి 13 ఏళ్ల క్రితం పెళ్లి కాగా, 12, 6 ఏళ్ల వయసు గల పిల్లలు ఉన్నారు.
చిక్కమగళూరులో బేకరి పెట్టుకొని జీవించేవారు. శుక్రవారం కారులో కెసగోడుకు వెళ్లారు. సాయంత్రం 6:30 గంటలకు రఘు బంధువులకు వీడియో కాల్ చేసి భార్యను హత్య చేస్తున్నట్లు చెప్పాడు. భార్యను కారులోనే గొంతు పిసికిచంపి, శవాన్ని పడేసి, ఊరికి సమీపంలో కారును నిలిపి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బంధువులు, పోలీసులు చేరుకుని గాలించగా, అతని శవం కనిపించింది, గగన జాడ లేదు, ఆమెను యగచి కాలువలో పడేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అరేహళ్లి పోలీసులు గాలింపు చేపట్టారు.


