పటియాలాలో సమావేశంలో హోరెత్తిన చన్నీ అనుకూల నినాదాలు
సీఎం అభ్యర్థిని ఎన్నికల తర్వాతే తేలుస్తామన్న రాష్ట్ర ఇన్ఛార్జి భూపేశ్ బఘేల్
పటియాలా: పంజాబ్ కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు మళ్లీ రాజుకుంటున్నాయి. శనివారం పటియాలాలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర చీఫ్ రాజా వారింగ్ ప్రసంగిస్తుండగానే మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి భూపేశ్ బఘేల్ వారించినప్పటికీ చన్నీ అనుకుల నినాదాలకు అడ్డుకట్ట పడలేదు. ఈ పరిణామంపై భూపేశ్ అసహనం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రమే సీఎం, మంత్రులెవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని బఘెల్ స్పష్టం చేశారు. ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా సరే, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వారికి బయటకు వెళ్లే తలుపులు తెరిచే ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. గతంలో నవ్జ్యోత్ కౌర్ సిద్ధూను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర చీఫ్ రాజా వారింగ్ ప్రసంగం మొదలవ్వగానే చన్నీ మద్దతుదారులు ‘చరణ్జీత్ సింగ్ చన్నీ జిందాబాద్, చన్నీకి పగ్గాలివ్వాలి–కాంగ్రెస్ను కాపాడాలి’అంటూ నినాదాలు చేశారు.
దీంతో, వారింగ్ ఆగ్రహానికి గురయ్యారు. క్రమశిక్షణ పాటించాలని, సమావేశాన్ని కొనసాగనివ్వాలని కార్యకర్తలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. ఇతర నేతలు సైతం కార్యకర్తలను వారించేందుకు ప్రయతి్నంచారు. పార్టీ కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు భూపేశ్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. జిల్లా, బ్లాక్ స్థాయి నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఫతేగఢ్ సాహిబ్, మొహాలీల్లో ‘హర్ బూత్, కాంగ్రెస్ మజ్బూత్’కార్యక్రమాలు చేపట్టి, కార్యకర్తలను ఐక్యంగా పనిచేయాలని కోరుతున్నారు. పంజాబ్లో తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.
శనివారం పటియాలాలో పార్టీ సమావేశం అనంతరం బఘెల్ మీడియాతో మాట్లాడారు. చన్నీపై చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు..మాజీ సీఎం ఏం తప్పు చేశారని చర్యలు తీసుకోవాలంటూ ఎదురు ప్రశ్న వేయడం గమనార్హం. శక్రవారం ఫతేగఢ్ సాహిబ్లో బఘెల్ మాట్లాడారు. తమ పార్టీ రాష్ట్ర విభాగంలో ఎటువంటి గ్రూపులు లేవంటూ చెప్పుకొచ్చారు. మీడియా, కొందరు వ్యక్తులు కలిసి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయంటూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వారింగ్ను రాష్ట్ర పార్టీ చీఫ్గా తిరిగి నియమిస్తూ అధిష్టానం ప్రకటించిన నాటి నుంచి అసమ్మతి జ్వాలలు రాజుకుంటున్నాయి.


