Himachal, Uttarakhand Rain Update: 51 Dead, Landslide, Houses Damaged - Sakshi
Sakshi News home page

ఉత్తరాన జల విలయం: కుంభవృష్టి.. ఆకస్మిక వరదలతో 50 మందికిపైగా మృతి

Published Mon, Aug 14 2023 8:12 PM

Himachal Uttarakhand Rain Updates: 51 dead Landslides Houses damaged - Sakshi

ఉత్తరాఖండ్‌ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు ఉత్తరాదిన జల ప్రళయాన్ని సృష్టించాయి. వర్షాలకు తోడు అకస్మిక వరదలు పోటెత్తడంతో ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యక్తం చేశాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.  కొండల్లో నుంచి వచ్చిన వరద నీటితోపాటు  కొట్టుకువచ్చిన బురద, మట్టి వందలాది ఇళ్లను నేలమట్టం చేసింది.

41 మంది మృతి
హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో పలుచోట్ల కొండచరియలు పేకమేడల్లా విరిగిపడుతున్నాయి.https://www.sakshi.com/telugu-news/national/954-police-medals-including-63-telugu-sates-onn-independence-day-eve-1735070 ఇప్పటి వరకు ఈ రకమైన ఘటనల్లో 41 మంది మృత్యువాతపడ్డారని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వంతెనలు, ఇళ్లు కొట్టుకుపోవడం, నదుల నీటి మట్టం పెరిగి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు.  
చదవండి: 954 మందికి పోలీసు పతకాలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 63 మంది ఎంపిక

జల ప్రళయానికి సాక్ష్యం
తాజాగా మండీ జిల్లాలో భారీ వర్షంతో ఆకస్మిక వరదలు వచ్చి ఏడుగురు కొట్టుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను స్వయంగా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయన్నారు. వీడియో చూస్తుంటే అక్కడ జల ప్రళయం ఎలా ఉంది అనటానికి సాక్ష్యంగా నిలుస్తోంది. 
చదవండి: తండ్రీకొడుకుల్ని బలిగొన్న నీట్‌.. స్టాలిన్‌ ఆవేదన

కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి
అంతకుముందు భారీ వర్షాలకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో 16 మంది చనిపోయారు. సోలన్ జిల్లాలోని జాదోన్  గ్రామంలో ఆదివారం ఆకస్మిక వరదలు సంభవించడంతో రెండేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. మరో ఘటనలో సిమ్లా నగరంలోని సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయం వద్ద కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మరణించారు.

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు
సోలన్ జిల్లాలోని బలేరా పంచాయతీలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. రామ్‌షెహెర్ తహసీల్‌లోని బనాల్ గ్రామంలో కొండచరియలు విరిగిపడి మరో మహిళ చనిపోయింది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హమీర్‌పూర్‌లో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా జిల్లావాసులందరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

విద్యాసంస్థలు బంద్‌ 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను ఆగస్టు 14 (సోమవారం) మూసివేస్తున్నట్లు సీఎం  సుఖ్వీందర్ సింగ్ ప్రకటించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను దూరంగా వెళ్లాలని ఆయన కోరారు. అలాగే ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర పర్యటనను టూరిస్టులు వాయిదా వేసుకోవాలని సూచించారు.  

రాష్ట్రంలో రూ. 7020.28 కోట్ల నష్టం
మరోవైపు వర్షాలతో అల్లకల్లోమవుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వరద కారణంగా సంభవించిన మరణాలు చాలా బాధాకరమైనవని పేర్కొన్నారు. స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ ప్రకారం వరదల కారణంగా  రాష్ట్రంలో 752 రోడ్లను మూసేశారు. వరదలు  కొండచరియలు విరిగిపడటం వల్ల హిమాచల్ ప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది. జూన్‌ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో రూ. 7020.28 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ఆదివారం పేర్కొన్నారు.

621 రోడ్లు మూసివేత
మండి, సిమ్లా, బిలాస్‌పూర్‌ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. సిమ్లాను చండీగఢ్‌ను కలిపే సిమ్లా-కాల్కా జాతీయ రహదారిపై రహదారి గత రెండు వారాలుగా పదే పదే కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా ప్రభావితమైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గత 48 గంటల్లో కురిసిన వర్షాల దెబ్బకు బియాస్‌, దాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. మాన్‌, కునా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హమీర్‌పుర్‌లో భవనాలు దెబ్బతిన్నాయి. పంటలు నీట మునిగాయి.

కేదార్‌నాథ్‌ యాత్ర నిలిపివేత
మరోవైపు ఉత్తరాఖండ్‌లో వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంతో గత 48 గంటల్లో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు దెబ్బతిన్నాయి. రెండు రోజులపాటు కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రకటించారు. గంగా నది మట్టం కూడా పెరుగుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని  రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచారని తెలిపారు. 

ఎడతెరిపి లేని వర్షాలతో ట్రాఫిక్‌ జామ్‌
కొండచరియలు విరిగిపడి, జాతీయ రహదారులతోపాటు వివిధ రోడ్లపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. తెహ్రీలోని కుంజపురి బగర్ధర్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రిషికేశ్‌-ఛంబా నేషనల్‌ హైవేను అధికారులు మూసివేశారు. హరిద్వార్‌లో గంగానది 294.90 మీటర్ల వద్ద ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. చమోలీ జిల్లాలోని త్రాలి, నందానగర్‌ ఘాట్‌ ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా ప్రభావితం అయ్యాయి. పిండర్‌, నందాకిని నదుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఓ మోటార్‌బ్రిడ్జ్‌, సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement