గాజియాబాద్: యూపీలోని గాజియాబాద్ తనిష్క్ షోరూమ్ చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుకాణంలో పనిచేస్తోన్న వ్యక్తే.. తన ప్రియురాలితో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. పెళ్లి కోసం ఆ వ్యక్తి.. గర్ల్ఫ్రెండ్తో కలిసి రూ.4కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లాడు. ఈ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు
తనిష్క్ ఉద్యోగి నితిన్ వర్మ (23), అతని ప్రియురాలు కాజల్ వర్మ (22), అతని తండ్రి సంజయ్ వర్మ (52). జూన్ 12న రాజ్ నగర్ డిస్ట్రిక్ట్ సెంటర్లోని తనిష్క్ షోరూమ్ నుండి రూ. 4 కోట్లకు పైగా విలువైన నగలను దొంగిలించినట్లు పోలీసులు నిర్థారించారు. పెళ్లి ఖర్చుల కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
నితిన్ ఆ షోరూమ్లో చేరి కేవలం నెల పదిహేను రోజులు మాత్రమే అయింది.. కానీ ఈ కొద్ది సమయంలోనే అతను స్టోర్ భద్రతా ఏర్పాట్లు, అత్యంత విలువైన నగలు ఎక్కడ ఉంచుతారనే విషయాలను తెలుసుకున్నాడు. ఘటనకు ఒక రోజు ముందే కాజల్తో తన పెళ్లి నిశ్చయమైందని చెబుతూ స్టోర్ సిబ్బందికి పార్టీ ఇచ్చాడు. ఆ వేడుకలో షోరూమ్ తాళాలు తన వద్దే ఉంచుకునే క్యాషియర్ గౌతమ్ రాజ్తో ఎక్కువగా మద్యం తాగిపించాడు. అనంతరం అతన్ని ఇంటి దగ్గర దింపుతానని చెప్పి.. అతని బ్యాగ్ నుండి షోరూమ్ మెయిన్ ఎంట్రన్స్ తాళాన్ని దొంగిలించాడు.
మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నితిన్ తన అనుచరుడితో కలిసి షోరూమ్కు వచ్చాడు. వారు దొంగిలించిన తాళంతో షట్టర్ తెరిచి.. ఎలాంటి అనుమానం రాకుండా లోపలికి వెళ్లడం సీసీటివి ఫుటేజీలో రికార్డయింది. డీసీపీ ధవళ్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ దొంగతనం పూర్తి చేయడానికి కేవలం 25 నిమిషాలు పట్టింది. వారు గ్రౌండ్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లను వదిలేసి.. బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలు పొదిగిన నగలు ఉన్న ఫస్ట్ ఫ్లోర్ను టార్గెట్ చేశారు. నితిన్ లోపలికి వెళ్లినప్పుడు ఓ అనుచరుడు బయట నిలబడి నిఘా ఉంచాడని పోలీసులు తెలిపారు. వారు సుమారు రూ. 4 కోట్ల విలువైన నగలను సర్దుకుని, ఎవరికీ దొరక్కుండా దూరంగా పార్క్ చేసిన వాహనంలో పరారయ్యారు.
ఈ దర్యాప్తులో షోరూమ్లోని తీవ్రమైన భద్రతా లోపాలు కూడా బయటపడ్డాయి. రూ.50 కోట్లకు పైగా విలువైన నగలు ఉన్నప్పటికీ.. అక్కడ ఎలాంటి అలారం సిస్టమ్ లేదు. రాత్రి వేళల్లో కేవలం ఒకే ఒక్క సెక్యూరిటీ గార్డును నియమించారు. అతను కూడా ఉదయం 7 గంటలకే డ్యూటీ నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీ విజువల్స్ను కంపెనీ హెడ్ ఆఫీస్ నుండి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ.. నిందితులు 25 నిమిషాలకు పైగా లోపలే ఉన్నా ఈ చొరబాటును ఎవరూ గమనించలేకపోయారు.
నితిన్, కాజల్ కలిసి ఈ దొంగతనానికి ప్లాన్ చేయగా.. దొంగిలించిన నగలను అమ్మడంలో సంజయ్ వర్మ సహాయం చేశాడు. తమకు వైద్య ఖర్చుల కోసం డబ్బు కావాలని అబద్ధాలు చెప్పి నిందితులు కొన్ని నగలను తక్కువ ధరలకే విక్రయించారు. ప్రస్తుతం అధికారులు రూ. 3.1 కోట్ల విలువైన దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ. 6.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.


