కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో గంగా నది ఉప్పొంగడంతో రతువా బ్లాక్ ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది. ఆసుపత్రిలో దాదాపు 40 శాతం ప్రాంతం నీటిలో మునిగిపోయింది. ప్రధాన రహదారితో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో అక్కడికి చిన్న పడవల ద్వారానే చేరుకునే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లోనూ డాక్టర్ అరిజీత్, కొద్దిమంది వైద్య సిబ్బందితో కలిసి ఆసుపత్రిని వీడకుండా రోగులకు చికిత్స అందిస్తున్నారు.
వరద నీటితో నిండిన ఆసుపత్రి కారిడార్లలో విషపూరిత పాములు, ఇతర కీటకాలు సంచరిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ డాక్టర్ అరిజీత్ చికిత్స అవసరమైన రోగుల వద్దకు వెళ్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేని రోగులకు వైద్యం అందించడమే తమ ప్రాధాన్యంగా ఆయన, వైద్య సిబ్బంది విధులు కొనసాగిస్తున్నారు.
ఈ పరిస్థితిని డాక్టర్ అరిజీత్ కష్టతరమైన సమయంగా అభివర్ణించారు. “ఇది చాలా కష్టంగా ఉంది. కానీ వైద్యులు, వైద్య సిబ్బందిగా చికిత్స అందించడం కూడా అవసరం. ప్రజలకు మన అవసరం ఎక్కువగా ఉండే సమయం ఇదే. ఈ ఆసుపత్రిలో పాములు, కీటకాలు ఉన్నాయి. అయినా ఈ కష్టకాలంలో రోగులను చూసుకోవడం మరింత ముఖ్యం” అని ఆయన తెలిపారు.
వరదల కారణంగా రతువా, మాణిక్చక్, రతన్పూర్ ప్రాంతాల్లో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. మొత్తం ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రిలోనూ అంధకారం నెలకొంది. అయినా డాక్టర్ అరిజీత్, వైద్య సిబ్బంది రోగుల సంరక్షణ కొనసాగిస్తున్నారు. “ఒక వైద్యుడికి ఆసుపత్రిని వదిలి వెళ్లడం ఎప్పుడూ ఒక ఎంపిక కాదు” అని డాక్టర్ అరిజీత్ చెప్పారు. వరద పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సేవలు అందించడం, సిబ్బంది భద్రత రెండూ కీలకంగా మారాయి.


