కోల్కతా: దుర్గా పూజ సందర్భంగా దుర్గాదేవి విగ్రహాల సమీపంలో మాంసాహారాన్ని విక్రయించవద్దని బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన విజ్ఞప్తి బెంగాల్ హిందువుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తమను హిందూ జాతీయవాదులుగా చెప్పుకునేవారు కూడా ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్లోని హౌరా లిలువాలో 3 రోజుల పాటు జరిగిన హనుమంత కథ కార్యక్రమానికి హాజరైన ధీరేంద్ర శాస్త్రి.. నవరాత్రులను భక్తి, నిష్ఠతో పాటించాలని బెంగాల్ హిందువులను కోరారు. ఇంట్లో దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించకపోయినా నవరాత్రి ఆచారాలను పాటించాలని సూచించారు. “బెంగాల్లోని హిందువులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నవరాత్రుల సమయంలో దేవత విగ్రహాలను ప్రతిష్ఠించకపోయినా, విగ్రహాల సమీపంలో మాంసాహారాన్ని విక్రయించవద్దు” అని ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అన్నారు.
పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ నిర్వాహకులకు విశ్వ హిందూ పరిషత్ ఇప్పటికే ఇదే తరహా సూచన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ధీరేంద్ర శాస్త్రి ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. దుర్గా పూజ మండపాల సమీపంలో మాంసాహారాన్ని ఉంచవద్దని, పండుగ పవిత్రతను కాపాడేందుకు ఈ సూచన చేస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ తెలిపింది.
ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలపై బెంగాల్లో పలువురు తీవ్రంగా స్పందించారు. కోల్కతాకు చెందిన కంటెంట్ క్రియేటర్ శ్రేయసి బిస్వాస్ బెనర్జీ.. బెంగాల్లో దుర్గా పూజను ఎలా జరుపుకోవాలో బయటి వ్యక్తులు చెప్పవద్దని అన్నారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు షామిక్ భట్టాచార్య ధీరేంద్ర శాస్త్రిని గౌరవనీయ వ్యక్తిగా భావిస్తున్నానని, ఆయనను కలిశానని తెలిపారు. అయితే మాంసాహారంపై శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, బీజేపీ వాటిని సమర్థించదని స్పష్టం చేశారు. “మేం బెంగాలీలు అష్టమి రోజు పూరీ తింటాం, నవమి రోజు మటన్ తింటాం” అని ఆయన అన్నారు.
మేలో బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో జరగనున్న తొలి దుర్గా పూజ ఇదే. దుర్గా పూజ పశ్చిమ బెంగాల్లో అతిపెద్ద పండుగ. కోల్కతా దుర్గా పూజకు యునెస్కో మానవాళి అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో స్థానం దక్కింది. ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్ సంస్కృతి, మత సంప్రదాయాలపై తన ఆలోచనలను రుద్దే అవకాశం ఉందని ప్రతిపక్షాలు, విమర్శకులు హెచ్చరించాయి. మాంసాహార ఆహారం కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివాదాస్పద అంశంగా మారింది.
సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు లిలువా వర్క్షాప్ గ్రౌండ్లో హనుమంత కథ జరిగింది. సెప్టెంబర్ 4న ముఖ్యమంత్రి సువేందు అధికారి ధీరేంద్ర శాస్త్రితో కలిసి వేదికను పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్లో బాగేశ్వర్ ధామ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.


