అమృతం బదులు విషం.. ఆయనో 'పెద్ద జోక్‌'! | DMK Launches Sharp Attack on Rahul Gandhi | Sakshi
Sakshi News home page

అమృతం బదులు విషం.. ఆయనో 'పెద్ద జోక్‌'!

Jun 16 2026 10:34 AM | Updated on Jun 16 2026 11:18 AM

DMK Launches Sharp Attack on Rahul Gandhi

ఒకప్పుడు కలిసి ఎన్నికలు పోరాడిన మిత్రపక్షాలు.. ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ప్రతిపక్ష ఐక్యతపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతుండగా.. మాజీ మిత్రపక్షం డీఎంకే ఊహించని స్థాయిలో ఎదురుదాడికి దిగింది. అలాంటి పాఠాలు చెప్పే హక్కు అసలు రాహుల్‌కు ఉందా?" అంటూ ప్రశ్నించిన డీఎంకే.. 'ఇండియా' కూటమిలో ఏర్పడిన విభేదాలకు కాంగ్రెస్‌నే బాధ్యురాలిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.

డీఎంకే-కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. రాహుల్‌ గాంధీపై ఆ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇటు డీఎంకే సోషల్‌ మీడియా విభాగం.. అటు అధికార పత్రిక మురసొలిలో వచ్చిన సంపాదకీయం కాంగ్రెస్‌ అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయంగా బలహీన స్థితిలో ఉన్నప్పుడు తమ పార్టీ కాంగ్రెస్‌కు అండగా నిలిచిందని, కానీ అవకాశం దొరకగానే కాంగ్రెస్‌ తమను వదిలేసిందని డీఎంకే సోషల్‌ మీడియా పేజీలు వరుస పోస్టులు పెడుతున్నాయి. అంతేకాకుండా రాహుల్‌ గాంధీని "పెద్ద జోక్‌.. రాజకీయ అపరిపక్వుడు"గా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేసింది.

ఇక డీఎంకే అధికార పత్రిక మురసొలి సంపాదకీయంలో ఆ డోస్‌ మరింత ఎక్కువే కనిపించింది. ఇటీవల ఇండియా కూటమి సమావేశం అనంతరం రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడే ముందు వివిధ రాష్ట్రాల్లో ఆ ఐక్యతను దెబ్బతీసింది ఎవరో ఆలోచించాలని సూచించింది. ముఖ్యంగా కేరళలో వామపక్షాలపై కాంగ్రెస్‌ వైఖరిని ప్రస్తావిస్తూ.. అక్కడి నేతలు గతంలో రాహుల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అలాగే.. తమిళనాడులో ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలను కూడా డీఎంకే ప్రస్తావించింది. 

2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్‌.. అనంతరం ఆ కూటమి నుంచి బయటకు వచ్చి నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో భాగస్వామి కావడాన్ని డీఎంకే "ద్రోహం"గా అభివర్ణించింది. ఈ నిర్ణయానికి కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం కూడా ఆమోదం తెలిపిందని ఆరోపించింది. అలాగే ప్రస్తుతం ఇండియా కూటమిలో ఏర్పడుతున్న విభేదాలకు బీజేపీ కంటే కాంగ్రెస్‌ వైఖరే ఎక్కువ కారణమని మురసొలి సంపాదకీయం పేర్కొంది. 

రాహుల్‌ గాంధీ రాజకీయ పరిపక్వత లోపం, స్థిరమైన వ్యూహం లేకపోవడమే ప్రతిపక్ష శిబిరంలో అసంతృప్తికి దారితీస్తోందని డీఎంకే విమర్శించింది. ప్రతిపక్ష కూటమిలో అమృతం బదులు విషం కలిపింది ఎవరు? అంటూ ఆ వ్యాసాన్ని ముగించింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ వర్గాలు ఖండించాయి. తమిళనాడులో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే విధంగానే పార్టీ నిర్ణయాలు తీసుకుందని, డీఎంకేను గానీ, ఇండియా కూటమిని గానీ బలహీనపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాయి.

ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కలిసిన మిత్రపక్షాలు ఇప్పుడు పరస్పరం విమర్శలు చేసుకోవడం.. ఇండియా కూటమి భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం ఎంత దూరం వెళ్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement