- శివాజీ కుమారుడు రామ్కుమార్ గణేశన్ చెప్పిన విషయాలు
దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ నటించిన అనేక చిత్రాలు.. స్వాతంత్య్రం అనంతర భారత నేపథ్యంతో తెరకెక్కాయి. మారుతున్న సమాజం ఎదుర్కొన్న పోరాటాలను ఆ చిత్రాలు చూపించాయి. రాజ్ కపూర్ నటించిన ఆవారా (1951) మాదిరిగానే, శివాజీ తొలి చిత్రం పరాశక్తి (1952) కూడా ఆర్థిక ఇబ్బందులు, భారతదేశంలోని పెద్ద నగరాలకు వలస వచ్చిన కార్మిక వర్గం ఎదుర్కొన్న కష్టాలను చిత్రీకరించింది. సత్యజిత్ రే తీసిన కొన్ని చిత్రాలు, ముఖ్యంగా ది అపు ట్రిలజీ, కూడా ఇలాంటి అంశాలను కలిగి ఉన్నాయి.
ఆసక్తికర విషయం ఏమిటంటే, 1960లలో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఎంబసీ సంయుక్తంగా నిర్వహించిన పర్యటనలో భాగంగా శివాజీ గణేశన్ హాలీవుడ్ను సందర్శించినప్పుడు, ఆయన మార్లన్ బ్రాండోతో చేసిన సంభాషణలో ప్రధాన అంశం భారత్లో పేదరికమే. ఈ విషయాన్ని శివాజీ కుమారుడు రామ్కుమార్ గణేశన్ ఇటీవల ట్రూలీ రామ్తో జరిగిన చర్చలో వెల్లడించారు.
రామ్కుమార్ మాట్లాడుతూ.. సత్యజిత్ రే తీసిన కొన్ని చిత్రాలు చూసిన తర్వాత భారత్లో కనిపించిన పేదరిక స్థాయిపై బ్రాండో మాట్లాడారని చెప్పారు. దీనికి ప్రతిగా, రే తన దేశంలోని పేదరికంపై అవగాహన పెంచేందుకు ఆ చిత్రాలు తీశారని, పశ్చిమ దేశాలకు వాటిని మార్కెట్ చేయాలనే ఉద్దేశం కాదని శివాజీ వివరించారని చెప్పారు. అంతేకాదు, తాను ధరించిన సూట్ను చూపిస్తూ భారత్లో అందరూ పేదలు కాదని ఆయన స్పష్టం చేశారని తెలిపారు.
"మా నాన్న ఆయనతో ఇలా చెప్పారు. 'మిస్టర్ బ్రాండో, నేను ధరించిన సూట్ చూశారా? ఇది $500 విలువైన సూట్. భారత్లో అందరూ పేదలు కాదు. ఇలాంటి సూట్లు కొనగలిగే వారు కూడా ఉన్నారు. పేదలు ఉన్నట్టే అలాంటి వారు కూడా ఉన్నారు'" అని అన్నారు.
ఆసక్తికరంగా, శివాజీ గణేశన్, సత్యజిత్ రే ఒక చలనచిత్రోత్సవంలో కలుసుకున్న విషయం తనకు 20 ఏళ్ల క్రితం వరకూ తెలియదని కూడా రామ్కుమార్ చెప్పారు. అలాగే, పేదరికంపై శివాజీ గణేశన్ అభిప్రాయం బ్రాండో ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చని ఆయన సూచించారు. దాని ఫలితంగానే 1973లో ది గాడ్ఫాదర్ చిత్రానికి వచ్చిన ఉత్తమ నటుడు ఆస్కార్ను తన తరఫున తిరస్కరించేలా స్థానిక అమెరికన్ ఉద్యమకారిణి సచీన్ లిటిల్ఫెదర్ను అకాడమీ అవార్డుల వేదికపైకి పంపి నిరసన తెలిపి ఉండొచ్చని అన్నారు.


