దారుణాలు బయటపెడితే.. ఉద్యోగం నుంచి తీసేశారు! | Bengaluru Capgemini Daycare Abuse Case, Employee Who Reported Torture Was Sacked, Watch Video Inside | Sakshi
Sakshi News home page

దారుణాలు బయటపెడితే.. ఉద్యోగం నుంచి తీసేశారు!

Jul 2 2026 1:54 PM | Updated on Jul 2 2026 2:23 PM

Capgemini Daycare Row: Employee Who Exposed Abuse Was Sacked

బెంగళూరు: క్యాప్‌జెమినీ బెంగళూరు క్యాంపస్‌లోని డేకేర్ సెంటర్‌లో చిన్నారులపై జరుగుతున్న అమానుష వేధింపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారులపై జరుగుతున్న హింసను గతంలోనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగినినే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తేలింది. 

జిల్లా బాలల సంరక్షణ అధికారి తిలకేశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డేకేర్‌ సెంటర్‌లో మొత్తం 50 నుంచి 60 మంది చిన్నారులు నమోదు కాగా, ప్రతిరోజూ 15 నుంచి 20 మంది హాజరవుతున్నారు. పిల్లలు ఏడుస్తున్నారనే కారణంతో వారిని వాషింగ్ మెషీన్‌లో కూర్చోబెట్టడం, బాత్‌రూమ్‌లో బంధించడం, టాయిలెట్ జెట్ స్ప్రేతో నీరు చల్లడం, భయపెట్టి మౌనం పాటించేలా చేయడం వంటి దారుణాలు చాలా కాలంగా జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అంతేకాదు..  

గతంలో ఓ ఉద్యోగి ఈ దారుణాలపై ప్రశ్నించిందని చెప్పారు. ఈ విషయమై కేర్‌టేకర్ల మీద సూపర్‌వైజర్‌కు ఫిర్యాదు చేసి.. ఎంత జరుగుతుందో తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా ఫిర్యాదు చేసిన ఆ ఉద్యోగినినే విధుల్లోంచి తొలగించారని అధికారులు తెలిపారు.

ఇటీవల ఈ దారుణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐదుగురు కేర్‌టేకర్లపై కేసు నమోదు చేసి, వీడియోలను కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు పంపించారు.

ఈ ఘటనపై స్పందించిన క్యాప్‌జెమినీ సంస్థ.. ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని, విచారణ పూర్తయ్యే వరకు బెంగళూరు క్యాంపస్‌లోని డేకేర్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే ఐదుగురు మహిళా కేర్‌టేకర్లపై బాలల సంరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలు గతంలో మరెన్ని జరిగాయనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఓ మహిళా అధికారిణికి దర్యాప్తు బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. ఇలాంటి కేర్‌ సెంటర్‌లలో పిల్లల భద్రతకు సంబంధించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement