నలుగురిని కనండి.. లక్ష పట్టుకెళ్లండి | Brahmin couples offered Rs 1 lakh for having 4 children | Sakshi
Sakshi News home page

నలుగురిని కనండి.. లక్ష పట్టుకెళ్లండి

Jan 14 2025 6:38 AM | Updated on Jan 14 2025 9:23 AM

Brahmin couples offered Rs 1 lakh for having 4 children

బ్రాహ్మణ కుటుంబాలకు పండిత్‌ విష్ణు రాజోరియా ఆఫర్‌

ఇండోర్‌: సమాజంలో బ్రాహ్మణుల జనాభా తగ్గిపోతోందని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి బ్రాహ్మణ జంట నలుగురిని కనాలని, నలుగురిని కన్న జంటలకు రూ.1 లక్ష బహుమతి ఇస్తానని మధ్యప్రదేశ్‌ పరశురామ్‌ కళ్యాణ్‌ బోర్డు చీఫ్‌ పండిత్‌ విష్ణు రాజోరియా వ్యాఖ్యానించారు. ఆదివారం ఇండోర్‌లో సనాధ్య బ్రాహ్మణ వర్గాల్లో పెళ్లీడు యువతీయువకుల పరిచయ సమ్మేళనం, వివాహ కార్యక్రమాలు జరిగాయి. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘బ్రాహ్మణ యువ జంటలు చక్కటి సంపాదన, ఉద్యోగం ఉండి కూడా కేవలం ఒక సంతానంతో సరిపెట్టేస్తున్నారు. ఈ పద్ధతి మంచి కాదు. సమాజంలో బ్రాహ్మణుల జనాభా తగ్గుతోంది. స్వాతంత్య్ర వచ్చినప్పటితో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. హిందూయేతర జనాభా అమాంతం పెరుగుతోంటే మన వర్గీయులు జనాభా వ్యవహారాలపై దృష్టిపెట్టడమే మానేశారు.

 ఇకనైనా ప్రతి బ్రాహ్మణ జంట కనీసం నలుగురిని కనాలి. అలా నలుగురు సంతానం ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకు తలో లక్ష రూపాయలు నగదు బహుమతిగా ఇస్తా. నేను పదవి నుంచి దిగిపోయాక కూడా ఇదే నజరానా కొనసాగేలా చూస్తా’’అని రాజోరియా అన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘పరశురామ్‌ కళ్యాణ్‌ బోర్డ్‌తో దీనికి సంబంధం లేదు. నా స్వంత ఖర్చులతో, సమాజంలోని కొన్ని వర్గాల మద్దతుతో నగదు బహుమతి అందిస్తా. ఇలాంటి పథకంతో మధ్యప్రదేశ్‌ బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదు’’అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement