యూపీలో ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది సజీవ దహనం! | Bareilly Fire Breaks out After Car Collides with Dumper | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: యూపీలో ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది సజీవ దహనం!

Dec 10 2023 7:38 AM | Updated on Dec 10 2023 9:48 AM

Bareilly Fire Breaks out After Car Collides with Dumper - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో గల నైనిటాల్ హైవేపై శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బరేలీ నుంచి బహేరీ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు టైరు పగిలి, డివైడర్‌ను దాటి అటువైపు నుంచి వస్తున్న డంపర్‌ను ఢీకొంది. దీంతో ఈ రెండు వాహనాల్లో పేలుడు సంభవించి, మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. 

సమాచారం అందుకున్న ఎస్‌ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని, అగ్నిమాపక సిబ్బందికి కబురంపారు. వారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పివేసి, వాహనాలను రోడ్డు మధ్య నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే బహేరి నివాసి సుమిత్ గుప్తాకు చెందిన ఎర్టిగా కారు బుకింగ్‌పై నడుస్తోంది. బహేరీకి చెందిన నారాయణ్ నాగ్లా నివాసి ఫుర్కాన్.. బరేలీకి కారును బుక్ చేసినట్లు సమాచారం. బహెరీలోని మొహల్లా జామ్‌లో నివాసం ఉంటున్న ఉవైస్ పెళ్లి ఊరేగింపు బరేలీలోని ఫహమ్ లాన్‌కు చేరుకుంది. ఈ పెళ్లి ఊరేగింపులో వినియోగించేందుకు ఈ కారును బుక్ చేసుకున్నారు. 

పెళ్లి ఊరేగింపు పూర్తయిన తర్వాత కొందరు పెళ్లివారు కారులో రాత్రి 11.45 గంటలకు బహెరీకి తిరిగి వస్తున్నారు. భోజిపురా పోలీస్ స్టేషన్‌కు 1.25 కి.మీ దూరంలోని బహెరీ దిశలో ఉన్న దబౌరా గ్రామ సమీపంలో కారు టైరు అకస్మాత్తుగా పగిలింది. దీంతో కారు బ్యాలెన్స్‌ తప్పి డివైడర్‌ను దాటి అటువైపు మళ్లి, ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొంది. పెద్ద శబ్ధంతో కారులో మంటలు చెలరేగాయి. డంపర్ ఈ కారును దాదాపు 25 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లింది. డంపర్ ముందు భాగం కూడా మంటల్లో చిక్కుకుంది. 

ఈ ప్రమాదాన్ని చూసిన డంపర్ డ్రైవర్, హెల్పర్‌ భయంతో వాహనం నుంచి దూకి పారిపోయారు. ఆ రోడ్డుపై ఇతర వాహనాల్లో వెళ్తున్నవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు అరగంట తరువాత అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఎస్‌ఎస్పీ ఘులే సుశీల్ చంద్రభాన్, సీఓ నవాబ్‌గంజ్ చమన్ సింగ్ చావ్డా, సీఎఫ్‌వో చంద్రమోహన్ శర్మ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్నవారంతా సజీవదహనమయ్యారు.ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎవరు? నేటితో చర్చలకు తెర?

Advertisement
 
Advertisement
Advertisement